Breaking News

రెక్కలకష్టం వర్షార్పణం

రెక్కలకష్టం వర్షార్పణం

సారథి, రామాయంపేట: ఆరుగాలం శ్రమించి పండించిన బుధవారం రాత్రి కురిసిన భారీవర్షానికి నీటిపాలైంది. రెక్కలకష్టం మట్టిలో కలిసిందని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిజాంపేట గ్రామానికి చెందిన చౌదర్ పల్లి స్వరూప. తనకున్న రెండెకరాల్లో యాసంగి సీజన్ లో వరి పంట సాగుచేసింది. వరి నూర్పిడి చేసి నెలరోజుల క్రితం నిజాంపేట వ్యవసాయ సబ్ మార్కెట్ లో నిజాంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు సెంటర్ కు వడ్లను తీసుకొచ్చింది. ‘మా ఆయన ఆరోగ్యం బాగాలేదని జర పంటను ఎలాగైనా కాంటా చేయాలని సెంటర్ నిర్వాహకులను బతిమాలినా పట్టించుకోలేదు’ అని ఆవేదన వ్యక్తంచేసింది. రాత్రి కురిసిన భారీవర్షానికి వరి ధాన్యం నీటిపాలైందని వాపోయింది. నిజాంపేట మండలంలోని బచ్చురాజ్ పల్లి గ్రామానికి చెందిన రైతు పిట్ల ముత్యాలు పొలంలోనే వరి ధాన్యం బస్తాలను ఉంచారు. వడ్లు తడవకుండా నానాప్రయత్నాలు చేశాడు. రాత్రి కురిసిన వర్షానికి పొలంలోనే వడ్లు తడిసి ముద్దయ్యాయి. వరి ధాన్యం పూర్తిగా నీటిపాలు కాకుండా కాల్వ తీస్తున్నాడు.

వడ్లు తడవకుండా వర్షపు నీరు వెళ్లేందుకు కాల్వ తీస్తున్న రైతు