Breaking News

దళిత బాలికపై దాష్టీకం

దళిత బాలికపై దాష్టీకం
  • చోరీ నెపంతో బంధించి.. కాళ్లపై కొడుతూ
  • యూపీలోని అమేథిలో అమానవీయ ఘటన
  • స్పందించిన కేంద్రమంత్రి స్మృతిఇరానీ
  • యోగి ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్​

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చోరీ నెపంతో ఓ దళిత బాలికను కొందరు చిత్రహింసలకు గురిచేశారు. ఆ అభాగ్యురాలిపై ఇష్టమొచ్చినట్లు దాడిచేశారు. మొత్తుకున్న వదిలిపెట్టలేదు. దొంగతనం ఎందుకు చేశావంటూ ఇంట్లో నేలపై పడుకోబెట్టి కాళ్లను ఓ కర్రపై అదిమిపట్టి మరోకర్రతో కొడుతూ అత్యంత కఠినంగా వ్యవహరించారు. నొప్పితో ఆ బాలిక విలవిల్లాడుతూ రోదిస్తున్నా కనీసం కనికరం చూపలేదు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కూడా నిందితులకు వంతుపాడటం గమనార్హం. ఈ ఘటనపై అమేథి ఎంపీ, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతిఇరానీ మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఖండించిన ప్రియాంకాగాంధీ

 దళితబాలికపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. ఈ వీడియోను ట్వీట్‌ చేస్తూ.. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిరోజు 34 కులపరమైన నేరాలు, మహిళలపై 135 నేరాలు నమోదవుతున్నా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని పోలీసు యంత్రాంగం నిద్రపోతుందని మండిపడ్డారు. ఈ కేసులోని బాధ్యులను 24 గంటల్లో అరెస్ట్​ చేయకపోతే ఆందోళనకు దిగుతామని యూపీ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. అమేథి పోలీసులు ఈ ఘటనపై స్పందించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ అర్పిత్‌ కపూర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద పలువురిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరైన నమన్‌ సోని అనే వ్యక్తిని అరెస్టు చేశామని, మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.