Breaking News

ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీం ఆందోళన

ఢిల్లీలో కాలుష్యంపై సుప్రీం ఆందోళన
  • సెంట్రల్‌ విస్టా పనులు కొనసాగడంపై ఆగ్రహం
  • ప్రభుత్వాన్ని వివరణ కోరుతామన్న చీఫ్‌ జస్టిస్‌ రమణ

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధించినప్పటికీ సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పనులు కొనసాగుతుండటంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని తెలిపింది. తాజాగా గాలి కాలుష్యం స్థాయి 419 అని, ఇది రోజు రోజుకూ పెరుగుతోందని తెలిపింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ దృష్టికి సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పనుల గురించి వచ్చింది. సీనియర్‌ అడ్వకేట్‌ వికాస్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఢిల్లీలో భవన నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం ఉన్నప్పటికీ, ప్రభుత్వం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పనులను వేగంగా నిర్వహిస్తోందని చెప్పారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, కాలుష్య నియంత్రణకు అనేక అవస్థలు పడుతున్నామన్నారు. సెంట్రల్‌ విస్టా అయినా, పరిశ్రమ అయినా, మరొకటి అయినా, తాము ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని చెప్పారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు నిర్మాణం గురించి సొలిజిటర్‌ జనరల్‌ను అడుగుతామన్నారు. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. తాము సోమవారం ఓ అఫిడవిట్‌ దాఖలు చేశామన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. మీరు ఓ కాగితాల కట్టను ఇస్తే మేం చదువుతామని ఎలా అనుకున్నారు? పిటిషనర్లు కూడా కొన్ని కాగితాలను దాఖలు చేశారు, వాటిని మేం చదవబోమని వారు అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందన్నారు. కాలుష్య నియంత్రణపై ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు పాటించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల్లో, మొక్కలు నాటడానికి సమగ్ర ప్రణాళికను రూపొందించి, 12 వారాల్లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. ఓవైపు కాలుష్యం పెరుగుతుండగా, కొత్తగా కొవిడ్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ బయటపడటం మరో సమస్య అని తెలిపింది.