Breaking News

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు …

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మొహమ్మద్ మసీ ఉల్లా ఖాన్
హైదరా బాదు ,

సామాజిక సారథి: నాగర్ కర్నూల్ జిల్లా లోని వక్ఫ్ బోర్డు స్థలంలో సమగ్ర సమాచారాన్ని సేకరించి అర్హులైన వారికి ఆటోనగర్ లో నిబంధనల ప్రకారం దుకాణాలను కేటాయించడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మహమ్మద్ మసి ఉల్లా ఖాన్ అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన మెకానిక్ లు ఇతర టెక్నికల్ కార్మికులు ముస్లిం సంఘాల పెద్దల ఆధ్వర్యంలో నాంపల్లిలోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మెకానిక్ లకు 2012 నుంచి దుకాణాలు కేటాయిస్తామని హామీలు ఇస్తూ పట్టించుకోవడంలేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా గతంలో ఇట్టి స్థలంలో ఆటోనగర్ నిర్మిస్తామని స్థానిక వక్ఫ్ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానించడం జరిగిందన్నారు. మెకానిక్ ల కోసం ఆటోనగర్ ను ఏర్పాటు చేయకుండా ప్రధాన రహదారికి అనుసరించి 20 దుకాణాలను ఇతరులకు కేటాయించడానికి ప్రస్తుత కమిటీ ముందుకు సాగుతున్నట్లు తెలిసిందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

నాగర్ కర్నూల్ వక్ఫ్ బోర్డు కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెప్పించుకొని ఆటోనగర్ అంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు గతంలో నాగర్ కర్నూల్ డ్రామా మస్జీద్, మొలన్షా సహాబ్ దర్గా, వట్టెం దర్గా లకు రావలసిన నిధులను జారీ చేయాలని కోరగా వెంటనే బకాయి ఉన్న నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు నాగర్ కర్నూల్ జిల్లాలోని పలు సమస్యలను మసీ ఉల్లా ఖాన్ దృష్టికి తీసుకురాగా ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

ఆస్తుల పరిరక్షణకు పక్కన ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాల పెద్దలు మహమ్మద్ హబీబ్ ఖాన్, మహమ్మద్ సాదిక్ పాషా, యాకూబ్ బావజిర్, హబీబ్ ఉర్ రహ్మాన్, మహమ్మద్ గౌస్,ఖాజా ఖాన్, మహమ్మద్ ఖాదర్, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మహమ్మద్ హుస్సేన్, అశ్రఫ్ లతోపాటు సుమారు 150 మంది మెకానిక్ లు, ఇతర టెక్నికల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.