Breaking News

జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు

జిల్లా, మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు
  • పంచాయతీల మాదిరిగానే నిర్ధిష్టమైన విధులు
  • పంచాయతీలు నిధులను సంపూర్ణంగా వాడుకోవచ్చు
  • ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: స్థానిక స్వపరిపాలన సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వారి పాత్రను మరింత క్రియాశీలం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఇస్తున్న మాదిరిగానే జిల్లా, మండల పరిషత్ లకు కూడా నిధులు కేటాయిస్తామని, నిర్ధిష్టమైన విధులు అప్పగిస్తామని వెల్లడించారు. మండల, జిల్లాస్థాయి అధికారుల అనుమతులు అవసరం లేకుండానే, గ్రామ పంచాయతీలు తమ నిధులను సంపూర్ణంగా వినియోగించుకునే అధికారం కొత్త పంచాయతీరాజ్ చట్టం కల్పించిందని, దీన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ..‘స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని, అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులను నేరుగా మంజూరు చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు నెలకు రూ.308 కోట్ల చొప్పున, మున్సిపాలిటీలకు నెలకు రూ.148 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నది. నిధుల కొరత లేకపోవడంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరుతో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంపింగ్​ యార్డులు, నర్సరీలు, వైకుంఠధామాలు సమకూరాయి. ఇదే తరహాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ లకు కూడా ప్రత్యేకంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తాం.’ అని ప్రకటించారు. జిల్లా, మండల పరిషత్​లకు అప్పగించాల్సిన బాధ్యతలను సీఎం కేసీఆర్​అధికారులకు సూచించారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు

పంచాయతీలు పూర్తి నిధులు వాడుకోవచ్చు
పంచాయతీలు తమ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా కొత్త చట్టంలో నిబంధనలు రూపొందించామని, కానీ కొన్నిచోట్ల రూ.రెండు లక్షలకు మించిన పనుల మంజూరుకు మండలాధికారుల నుంచి అనుమతి పొందాలనే పాత నిబంధన అమలు చేస్తున్నారని అన్నారు. ఇది కొత్తచట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు తమ నిధులను గ్రామ అవసరాలు తీర్చడానికి సంపూర్ణంగా వినియోగించుకునే హక్కు ఉందని, ఎవరి జోక్యం అక్కర్లేదన్నారు. ఈ విషయంలో అధికారులు మరోసారి స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రి ఏ.ఇంద్రకరణ్​రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్ రామారావు, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, ప్రభుత్వ విప్ లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్ధన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు