Breaking News

శభాష్ విలేజ్ సెక్రటరీ!

శభాష్ విలేజ్ సెక్రెటరీ

సారథి, సిద్దిపేట, కరీంనగర్ ప్రతినిధి: ఆయన ఓ గ్రామానికి కార్యదర్శి కానీ కరోనాతో బాధపడుతున్న గ్రామస్తులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని గునుకులపల్లిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. గ్రామంలో సుపరిపాలన సాగాలని గ్రామ ప్రథమ పౌరుడితో ఆ గ్రామ సెక్రటరీ శ్రావణ్ కదం తొక్కుతూ గ్రామస్తులతో మమేకమవుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభించకుండా అనేక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ రైతు కటుంబ సభ్యులందరికీ కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. భయంతో గ్రామస్తులు ఆ ఇంటివైపు కన్నెత్తి చూడకపొవడంతో ప్రతిరోజు ఆ కుటుంబసభ్యులకు నిత్యవసర వస్తులు, కూరగాయలు, పాలు, కోడిగుడ్లు, తాగడానికి మినరల్ వాటర్ ను తనే స్వయంగా వెళ్లి అందజేస్తూ ఆ కుటుంబసభ్యుల్లో మనోధైర్యం నింపుతున్నారు.

అలాగే ఆ రైతుకు చెందిన పాడిగేదెలు, ఏడ్లకు ప్రతిరోజు మేత వేయడం, రెండుసార్లు నీళ్లు తాగించడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలను అన్నీ తానై చూస్తున్నారు. కరోనా వచ్చిన కుటుంబసభ్యుల ఇంటి చుట్టూ సోడియం హైపోక్లోరైడ్​ పిచికారీ చేయించి ఏదైనా సమస్య వస్తే తనకు ఫోన్ చేయాలని, తానెప్పుడు గ్రామంలోనే ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కరోనా బారినపడిన ఆ కుటుంబానికి గ్రామ కార్యదర్శి శ్రావణ్ చేస్తున్న మంచి పనికి ‘శభాష్​ కార్యదర్శి’ అని గ్రామస్తులు, యువకులు, ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.