Breaking News

దివ్యాంగుడిపై సర్పంచ్ ​దాష్టీకం

దివ్యాంగుడిపై సర్పంచ్​దాష్టీకం

సామాజికసారథి, తాడూరు: ఓ పంచాయితీ విషయంలో దివ్యాంగుడిపై సర్పంచ్​ప్రతాపం చూపించాడు. సర్దిచెప్పాల్సింది పోయి సదరు వ్యక్తిపై పిడిగుద్దులకు దిగాడు. దీంతో ఆయన దవడ దెబ్బతినడంతో లబోదిబోమంటున్నాడు. ఈ ఘటన గురువారం తాడూరు మండలం అల్లాపూర్​లో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఆవుల తిరుపతయ్య భిక్షాటన చూస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని సోదరుడి కుమారుడు బాలకృష్ణ, అదే గ్రామానికి చెందిన శాంతయ్య గొడవపడ్డారు. ఈ విషయమై ఆవుల తిరుపతయ్యతో మాట్లాడేందుకు గ్రామ సర్పంచ్​ జి.నిరంజన్ ​పిలిపించాడు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని తిరుపతయ్య చెప్పాడు. మాటామాట పెరగడంతో ఇంతలో సర్పంచ్ ​జి.నిరంజన్.. దివ్యాంగుడైన తిరుపతయ్యపై ముష్టిఘాతాలు కురిపించాడు. దీంతో ఆయన దవడ పళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయమై బాధితుడు తిరుపతయ్య జిల్లా ఎస్పీకి ఫోన్​లో ఫిర్యాదు చేశాడు. తాడూరు ఎస్సైకి కూడా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసు అధికారులు విచారణకు ఆదేశించారు.