- పనులు చేసిన వార్డు సభ్యుడు పనులు
- ప్రభుత్వం నుంచి పైసా రాక లబోదిబో
సామాజికసారథి, బిజినేపల్లి: ప్రభుత్వం నుంచి పని వచ్చిందని, మున్ముందు గ్రామానికి అవసరం వస్తుందని అప్పుచేసి మరీ పనులు చేశారు. బిల్లులు రాకపోతాయా..? అని చకచకా పూర్తిచేశారు. అభివృద్ధి పనులు చేసింది ఒకరైతే బిల్లులు తెచ్చుకున్నది మరొకరు.. తీరా అధికారుల వద్దకు వెళ్లి ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతు వేదికలను మంజూరుచేసింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యుడు ముందుగానే లక్షలాది రూపాయల అప్పుతెచ్చి మరీ రైతువేదిక కట్టారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోయారు. చివరి ప్రయత్నంలో ఎస్టీవో ఆఫీసుకు వెళ్లి బిల్లుల ఆలస్యంపై నిలదీయగా సర్పంచ్ భర్త, సదరు పంచాయతీ కార్యదర్శి ఎంబీ బిల్లులు తెచ్చి నిధులను డ్రా చేశారని చెప్పారు. దీంతో సదరు వార్డు సభ్యుడు కంగుతిన్నాడు. బిల్లుల సంగతి ఏమైందని అడిగేందుకు వార్డు సభ్యుడు సర్పంచ్ ఇంటికి వెళ్లారు. ‘పనులు చేసింది నేను కదా బిల్లులు ఎందుకు డ్రా చేశావు’ అని గట్టిగానే నిలదీశారు. తనకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సర్పంచ్ భర్త ‘మమ్మల్నే నిలదీస్తావా?’ అని ఇంట్లోకి పిలిచి చితకబాదారు. సర్పంచ్ నానాదుర్భాషలాడింది. బాధిత వార్డు సభ్యుడు లబోదిబోమని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగుచూడటంతో మండలంలో సర్వత్రా చర్చనీయాంశమైంది.