![అన్నదాతలకు అండగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/rsp.jpg?fit=650%2C373&ssl=1)
సామాజిక సారథి, సిద్దిపేట: అన్నదాతలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లిలో రైతులతో ఆయన మాట్లాడారు. వానకు తడవగా.. ఎండబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాలవర్షాలతో ధాన్యం తడిసి పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన పంట వర్షాల కారణంగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, రైస్మిల్లుల వద్ద జరుగుతున్న దోపిడీతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.