Breaking News

ఎలాంటి పరిస్థితినైనా..ఎదుర్కొనేందుకు సిద్ధం

ఎలాంటి పరిస్థితినైనా..ఎదుర్కొనేందుకు సిద్ధం

  • కొత్త వేరియంట్‌పై ఆరోగ్యశాఖ నివేదిక
  • వ్యాక్సినేషన్​ పక్రియను వేగవంతం చేయాలి
  • దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించాలి
  • మంత్రివర్గ సమావేశంలో సీఎం కేసీఆర్​

సామాజిక సారథి, హైదరాబాద్‌: కొత్తవ వేరియంట్​పై ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్​వేరియంట్​పై చర్యలకు సీఎం  కె.చంద్రశేఖర్​రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతిభవన్‌లో సోమవారం భేటీ అయింది. రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించిన హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్‌, బెడ్స్‌ సామర్థ్యం తదితర అంశాలపై కేబినెట్‌ సమీక్షించింది. కార్యాచరణపై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. మరిన్ని ఎక్కువగా కరోనా పరీక్షలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్ల సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంలో కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి నేపథ్యంలో దానిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు. రెండేళ్లుగా కరోనా కట్టడికి జరిగిన పురోగతిపై మంత్రివర్గం చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, తామంతా సంసిద్ధంగా ఉన్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్​ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులంతా వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జిల్లాల వారీగా టీకా ప్రక్రియను సమీక్షించి, ఆదిలాబాద్‌, కుమ్రంభీం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది.