![ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2023/01/2345-copy.jpg?fit=1094%2C587&ssl=1)
సామాజికసారథి, రామకృష్ణాపూర్ (చెన్నూరు): నియోజకవర్గంలోని ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి గుర్తుచేశారు. నియోజకవర్గంలోని జైపూర్ మండలం సుప్రసిద్ధ శైవక్షేత్రం వేలాల గట్టు మల్లన్న ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.2.20 కోట్లతో వేలాల కమాన్ నుంచి గుట్టపై ఆలయం వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించే బీటీ రోడ్డు పూర్తయిందని, మిగిలిన 700 మీటర్ల సిసి రోడ్డు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రానున్న శివరాత్రికి నెల రోజుల ముందుగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే మందమర్రి మండలంలోని ఆదివాసుల ఆరాధ్యదైవం, విశిష్ట చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో రూ.2.10 కోట్లతో బొక్కల గుట్ట గ్రామం నుంచి గాంధారి ఖిల్లా ఆలయం వరకు బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. మైసమ్మ జాతరలో ఏర్పాటు చేసిన దర్బారులో రోడ్డు నిర్మాణం చేస్తానని ఇచ్చిన హామీని పది నెలల్లో పూర్తి చేశానని విప్ ఆశా భావం వ్యక్తం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కృషి చేస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ కు ప్రజల్లో నుంచి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి.