Breaking News

కొంత మందికే కరోనా టెస్టులు

కొంత మందికే కరోనా టెస్టులు

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి రైతు వేదికలో నిర్వహిస్తున్న కరోనా టెస్టింగ్ కేంద్రాలకు జనం బారులుదీరుతున్నారు. రోజు 100 మంది నుంచి 150 మంది టెస్టుల కోసం వస్తుండగా, కిట్లు మాత్రం 50 ఉంటున్నాయి. దీనితో పరీక్షల కోసం రెండు మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. రోజుకు 50 టెస్టులు చేయగా అందులో 20 నుంచి 25 వరకు పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత 25 రోజుల్లో చొప్పదండిలో 30 నుంచి 40 మంది వరకు కరోనాతో మరణించారు. కిట్లు సరిపడా లేక ప్రజలు ఇంటికి తిరిగి వెళ్తున్నారు. దీంతో వ్యాధితీవ్రత పెరిగి ఇబ్బంది పడుతున్నారు. సరైన సమయానికి టెస్టు చేయక, తమ పని తాము చేసుకుంటున్నారు. ఒకవేళ వారికి పాజిటివ్ ఉన్నట్టయితే మరింత మందికి వచ్చే అవకాశం ఉంది. టెస్టుల సంఖ్య తగ్గించి కేసులు తక్కువ నమోదవుతున్నాయని చేతులు దులుపుకుంటున్నారు. కిట్ల సంఖ్యను పెంచి వీలైనంత మందికి కొవిడ్ నిర్ధారణ టెస్టులు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.