Breaking News

ఫోర్బ్స్‌ జాబితాలో ‘నిర్మల’కు మళ్లీ చోటు

ఫోర్బ్స్‌ జాబితాలో ‘నిర్మల’కు మళ్లీ చోటు
  • అత్యంత ప్రతిభావంతురాలిగా వరుసగా రికార్డు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రపంచంలో వందమంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి స్థానం దక్కించుకున్నారు. గతేడాది కన్నా ఈ సంవత్సరం ఆమె మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం. గతేడాది 41వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 37వ స్థానాన్ని దక్కించుకున్నారు. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్‌ యెల్లెన్‌ కన్నా రెండు స్థానాలు ముందంజలో ఉండటం మరో విశేషం. మన దేశ తొలి పూర్తి స్థాయి మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మల సీతారామన్‌ ఈ జాబితాలో 2019లో 34వ స్థానంలోనూ, 2020లో 41వ స్థానంలోనూ, 2021లో 37వ స్థానంలోనూ నిలిచారు. అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ ప్రతి ఏడాది 100 మంది అత్యంత శక్తిమంతులైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో 40 మంది సీఈవోలు ఉన్నారు. వీరు 3.3 ట్రిలియన్ల డాలర్ల రెవెన్యూను పర్యవేక్షిస్తున్నట్లు ఈ పత్రిక తెలిపింది. ప్రపంచంలో 19 మంది మహిళా నేతలు, ఓ ఇమ్యునాలజిస్ట్‌ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. దాతృత్వంగల మహిళ మెకెంజీ స్కాట్‌ ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్‌ రెండో స్థానాన్ని, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ క్రిస్టిన్‌ లగార్డే మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈవో రోషిణి నాడార్‌ మల్హోత్రా, బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్‌ ఉన్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాన మంత్రి షేక్‌ హసీనా కూడా ఈ జాబితాలో గుర్తింపు పొందారు.