Breaking News

పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

పచ్చదనంతో అందమైన జిల్లాగా తీర్చిదిద్దాలి

సారథి ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలను నాటి పచ్చదనం పెంచి అందమైన జగిత్యాలగా మార్చాలని జిల్లా కలెక్టర్ జి.రవి సూచించారు. జగిత్యాల నుంచి థరూర్ క్యాంప్, రాజరాంపల్లి, నూకపల్లి, మాల్యాల చౌరస్తా రోడ్డు, ముత్యంపేట, దొంగలమర్రి, పుడూరు, తుర్కకాశీనగర్, రైల్వే ట్రాక్ వరకు జాతీయ రహదారి 65కు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలు చేపడుతున్న మొక్కలు నాటే పనులను మంగళవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా, రోడ్డుకు కొంత దూరంలో మొక్కలను నాటాలని, గతంలో నాటిన వాటి మధ్య దూరం ఎక్కువగా లేకుండా గుంతలను ఏర్పాటు చేయాలని, పెద్దమొక్కలను నాటేలా చూడాలని సూచించారు. గతంలో నాటిన మొక్కలు వంగిపోవడం, ట్రీగార్డ్స్ పడిపోవడం వంటివి చాలా చోట్ల జరిగాయని, వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు. కలెక్టర్​వెంట డీఆర్డీవో వినోద్ కుమార్, జగిత్యాల, మల్యాల, కోడిమ్యాల ఎంపీడీవోలు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీవోలు, సెక్రటరీలు, ఈజీఎస్ సిబ్బంది, సర్పంచ్​లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.