![పిల్లలను దూషించినా, ఇబ్బందిపెట్టినా నేరమే](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/SP2F.jpg?fit=677%2C303&ssl=1)
సారథి న్యూస్, మెదక్: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్సభ్యుడు డాక్టర్ఆర్జీ ఆనంద్ అన్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండడంతో పాటు వారికి ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చిన్నారులను దూషించినా, ఇబ్బందులు కలిగించినా వెంటనే కేసులు నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ‘పిల్లలు.. వారి హక్కులు’పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల సంరక్షణ కమిటీ, చైల్డ్వెల్ఫేర్ పోలీస్, విద్యాశాఖ అధికారులు బాల్యవివాహాలు జరగకుండా చూడాలని కోరారు. చిన్నతనంలోనే జరిగే పెళ్లిళ్లతో కలిగే అనర్థాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో పిల్లలు, వారి తల్లిదండ్రులకు స్కూళ్లకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లాను చైల్డ్ఫ్రెండ్లీ విలేజీగా మార్చాలని డాక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషిచేయాలని సూచించారు. అనంతరం మెదక్ పట్టణంలోని బాలికల హైస్కూలును సందర్శించారు. సమావేశంలో మెదక్ డీఈవో రమేష్ కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, చైల్డ్వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శివకుమారి, ఎస్సీ కార్పొరేషన్ఈడీ దేవయ్య, డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ ఆర్డీవో సాయిరామ్, సీడీపీవోలు హేమభార్గవి, పద్మావతి, భార్గవి, డీసీపీవో కరుణశీల, ఈవో పద్మలత, ఐసీపీఎస్ చైల్డ్లైన్ సభ్యులు అశోక్ పాల్గొన్నారు.