Breaking News

ఇంటికి తాళం వేస్తే ఇక అంతే..!

ఇంటికి తాళం వేస్తే ఇక అంతే..!

– వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్

– భయాందోళనలో పట్టణ ప్రజలు

– ఓకేరోజు నాలుగు ఇళ్లలో చోరీ

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఇంటికి తాళం వేశారో ఇక మీ పని అంతే.. వరుస దొంగతనాలతో పోలీసులు పరేషాన్.. భయాందోళనలో పట్టణ ప్రజలు.. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న ‘రామకృష్ణాపూర్’ పట్టణంలో కొద్ది రోజుల వ్యవధిలోనే నిత్యం ఎక్కడో ఓచోట దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఉన్న ఇండ్లను దొంగలు ఎక్కువగా టార్గెట్ చేసి, రాత్రికి రాత్రే అందినకాడికి దొచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస దొంగతనాలతో పట్టణ పోలీసులు పరేషాన్ అవుతున్నారు. పట్టణంలో నిఘా నేత్రలు (సీసీ కెమెరాలు) ఉన్నపటికీ సరైన రికార్డింగ్ సదుపాయం లేకపోవడంతో నేరస్తులను గుర్తించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే ఆరోపణలు సైతం ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన దొంగతనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధాన చౌరస్తాలతో పాటు ప్రతి వార్డులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా పట్టణ ఎస్సై అశోక్ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

– విద్యానగర్ లో దొంగతనం

పట్టణంలోని భగత్ సింగ్ నగర్, విద్యానగర్, అశోక్ నగర్ లోని నాలుగు ఇండ్లలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. విద్యానగర్ లో నివసిస్తున్న సింగరేణి రిటైర్డ్ కార్మికుడు జంగిలి కిష్టయ్య ఇంట్లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. రెండు రోజులు ఊరికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి వెనుక తలుపు, బీరువాలోనీ బట్టలు కిందపడి ఉన్న విధానాన్ని గమనించి దొంగతనం జరిగినట్లుగా గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీరువాలోని ఒక రూ. 1.30లక్షల నగదు, 30తులాల వెండి, 3 సిల్వర్ కుంకుమ భరణిలను దొంగలు అపహరించినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలాన్ని  ఎస్సై పరిశీలించి, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరించారు. బాధితుడు కిష్టయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.