Breaking News

నాకు నచ్చింది వీళ్లే

ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు దాటినా ఏమాత్రం గ్లామర్​ తగ్గని హీరోయిన్ శ్రియాశరణ్. స్పెషల్ సాంగ్స్ చేయడంలో మొదటి అడుగు వేసిన ఈ గ్లామర్ డాల్ 2001లో ‘నా ఇష్టం’ సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. కింగ్ నాగార్జునతో నటించిన ‘సంతోషం’ సినిమాతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలైన నాగార్జున, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, మోహన్ బాబు, విక్రమ్​ సరసన నటించింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్ నెక్స్ట్ జనరేషన్ స్టార్ హీరోలతో కూడా నటించిన శ్రీయా.. శర్వానంద్ అల్లరి నరేష్, తరుణ్ లాంటి హీరోల సరసన కూడా మెరిసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసిన శ్రీయ ఇప్పటికీ నటిస్తూనే ఉంది. 2018లో ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీయ ప్రస్తుతం భర్తతో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనాలో ఉండిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ డైలీ తన అప్ డేట్స్ పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల లిస్ట్​లో మోస్ట్ వాంటెడ్ అయ్యింది.

అయితే రెండు దశాబ్దాలుగా యువ హృదయాలు కొల్లగొట్టిన శ్రియా శరణ్​.. తాను నటించిన కొంతమంది హీరోల గురించి అడిగితే తడుముకోకుండా వారి గురించి చెప్పుకుంటూ వచ్చింది శ్రీయ. ‘ఛత్రపతి’ సినిమా గుర్తుచేసుకుంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కళ్లు బాగుంటాయని.. అలా చూస్తూ ఉండిపోవచ్చట.. తర్వాత ‘మున్నా’ సినిమాలో ఒక సాంగ్ లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తమిళంలో తనకు ఫేవరేట్ హీరో అని.. ఆయన ఒక పవర్ హౌస్​ అంటూ.. రజినీతో కలిసి ‘శివాజీ’ సినిమాలో నటించేటప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా అంది.. ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు చూస్తే చాలా సైలెంట్ గా కనిపించేవాడని.. కానీ ఇప్పుడు చాలా మారిపోయాడు.. ప్రస్తుతం అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుందట.. శ్రీయ, ఎన్టీఆర్​లు ‘నా అల్లుడు’ సినిమాలో కలిసి నటించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ అతను చాలా మంచి యాక్టర్.. ఆయన బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేవారని చెప్పిది. తమిళ్ హీరో ధనుష్ అద్భుతమైన టాలెంటెడ్ యాక్టర్ అని.. ఆయనతో నటించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటోంది. అంతేకాదు ధనుష్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని, అతనికి కొడుకు పుట్టినప్పుడు నేను తండ్రి అయ్యానని సంతోషంగా అందరికీ చెప్పాడట.

ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న యువ హీరోయిన్స్ కు తానేమీ టిప్స్ ఇవ్వను..‘బాగా కష్టపడండి.. వర్క్ ఎంజాయ్ చేయడం నేర్చుకోండి.. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగిపోండి..” అంటూ సూచనలు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రపంచాన్ని చుట్టి ఉన్న కరోనా చాలా విషయాలను నేర్పిందట.. దీని వలన జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని.. లాక్ డౌన్ స్టోరీస్ ఇన్​స్పైర్​ చేశాయని చెప్పుకొచ్చింది. ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ మొత్తం ఐదు సినిమాలకు కమిట్ అయినట్లు వెల్లడించింది. తెలుగులో రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాటు మొదటిసారి సృజన అనే లేడీ డైరెక్టర్ తో ఒక సినిమా చేయనుందట. అంతేకాకుండా రెండు తమిళ సినిమాలు.. ‘తడ్కా’ అనే హిందీ సినిమా కూడా చేస్తోందట. మొత్తం మీద ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న హీరోయిన్స్ ఒకటీ రెండు సినిమాలకు పరిమితమవుతుంటే ఇండస్ట్రీకొచ్చి 20 ఏళ్లు దాటుతున్నా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ యంగ్ స్టర్స్ కు కూడా కాంపిటేషన్ గా మారుతోంది శ్రియా శరణ్.