Breaking News

స్తంభించిన సింగరేణి

స్తంభించిన సింగరేణి
  • కార్మికుల సమ్మె సక్సెస్​
  • మూడోరోజూ కొనసాగిన నిరసనలు
  • కార్మిక సంఘాల బైక్​ర్యాలీ
  • నిలిచిన 6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
  • బొగ్గు గనులపై కేంద్రం కుట్ర:  ప్రభుత్వ విప్​బాల్క సుమన్​

సామాజిక సారథి, కరీంనగర్‌: బొగ్గుగనుల ప్రైవేటీకీకరణకు వ్యతిరేకంగా చేపట్టిని సింగరేణి సమ్మె సక్సెస్​అయింది. శనివారం మూడో రోజుకు చేరింది. సిగరేణివ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మొత్తం 23 భూగర్భగనులు, 16 ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో సమ్మె విజయవంతమైంది. రామగుండంలో బొగ్గు క్షేత్రాల్లో మూడవ రోజు సమ్మె విజయవంతంగా కొనసాగింది. రీజియన్‌లోని ఆరు భూగర్భ, నాలుగు ఉపరితల గనుల్లో కార్మికులు విధులు బహిష్కరించారు. దీంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు బైక్‌ ర్యాలీ నిర్వహించాయి.

బీజేపీ నేతలు బట్టేబాజ్‌ గాళ్లు

ప్రతి అంశంలో తెలంగాణను  ఇబ్బంది పెట్టే ప్రయత్నం బీజేపీ బట్టేబాజ్‌ గాళ్లు చేస్తున్నారన్నారని, దీనిపై కేంద్రమంత్రి జి.కిషన్‌ రెడ్డి స్పందించాలని ప్రభుత్వ విప్​బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర  ప్రజలపై కేంద్రం కక్ష పెంచుకుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ విద్యుత్‌ అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రముఖ పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. సింగరేణిపై బీజేపీ కన్నుపడి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్​పరం చేసేందుకు ఆలోచన చేస్తోందన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతరేకంగా కార్మికులకు మద్దతుగా తాము సమ్మెలో పాల్గొన్నామని చెప్పారు. బొగ్గు బ్లాకులను వేలం వేయొద్దని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారని వివరించారు. కేంద్రం తీరు దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందన్నారు. గుజరాత్‌లో మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌కు లిగ్నైట్‌ బ్లాకులను వేలం లేకుండా అప్పగించారని తెలిపారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ప్రభుత్వానికి అప్పగించమని కోరితే ఇవ్వడం లేదని మండిపడ్డారు. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా అని ప్రశ్నించారు. మోడీకి మిత్రులైన అదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.