Breaking News

సర్పంచ్​ తండ్రి ఆగడాలు.. టీఆర్ఎస్ ​నుంచి బహిష్కరణ

టీఆర్ఎస్​నుంచి మిద్దె బాలస్వామి బహిష్కరణ
  • ‘సామాజికసారథి’ కథనంపై ఉలిక్కిపాటు
  • నిజనిర్ధారణ కమిటీ వేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని కారుకొండ గ్రామంలో ఓ పేద కుటుంబంపై అరాచకం సాగిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్​మిద్దె శ్రీశైలం తండ్రి బాలస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు. కొడుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామంలో అరాచకాలు సాగిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ‘సామాజికసారథి’లో ‘కారుకొండలో కీచకుడు’ శీర్షికన కథనం కూడా వెలువడింది. తాజాగా శనివారం ‘వివాహితపై కన్నేసి.. డబ్బును కాజేసి’ శీర్షికన బాధితురాలి కన్నీటిగాథను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయం నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. కారుకొండలో విచారణ జరిపేందుకు ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ ​నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. మిద్దె బాలస్వామి అరాచకాలు వాస్తవమేనని, టీఆర్ఎస్ ​నుంచి అతని సస్పెండ్ ​చేస్తున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని వారు ప్రకటించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ కురుమయ్య, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి , టీఆర్​ఎస్​ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి, నాయకులు రాము నాయక్ , శేఖర్ రావు ఉన్నారు.

విచారిస్తున్న ఎంపీటీసీ సభ్యుడు మంగి విజయ్​ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ సభ్యులు

ఏం జరిగిందంటే..
కారుకొండ గ్రామానికి చెందిన మెట్ట వెంకట్రాములు భార్య మెట్ట గౌరమ్మ పేర ఐదెకరాల పొలం ఉంది. వారికి ట్రాక్టర్​కూడా ఉంది. సొంత పొలం పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్​లో పోవడంతో ప్రభుత్వం నుంచి రూ.22లక్షల పరిహారం వచ్చింది. మిద్దె బాలస్వామి.. గౌరమ్మ భార్యాభర్తలను తన వద్ద పనికి కుదుర్చుకున్నాడు. వెంకట్రాములు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.18లక్షలను పలు సందర్భాల్లో బాలస్వామి తన బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్​ఫర్​ చేయించుకున్నాడు. ‘మీ పేర పొలం కొంటానని’ చెప్పి నమ్మించాడు. డబ్బును తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో వెంకట్రాములును భయపెట్టి గౌరమ్మను లొంగదీసుకున్నాడు. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ట్రాక్టర్​ను కూడా బలవంతంగా తెచ్చుకున్నాడు. తమకు జరుగుతున్న అన్యాయంపై బాధిత భార్యాభర్తలు బిజినేపల్లి పోలీసులను ఆశ్రయించినా కేసు కూడా నమోదు చేయలేదు. కొడుకు అసలే సర్పంచ్.. ఊరిలో అసలు విషయం తెలుస్తుందని భావించి బిజినేపల్లిలో రూమ్​పెట్టి గౌరమ్మను రెండునెలల పాటు నిర్బంధించాడు. బాలస్వామి కుటుంబానికి భయపడిన వెంకట్రాములు ఊరును విడిచాడు. చివరికి చేసేది భార్యాభర్తలు హైదరాబాద్​లో తలదాచుకుని మీడియా ఎదుట తమ కన్నీటి గాథను వెళ్లబోసుకున్నారు. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకులు భరోసా ఇవ్వడంతో బాధితురాలు గౌరమ్మ, వెంకట్రాములు ‘సామాజికసారథి’కి కృతజ్ఞతలు తెలిపారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు

One thought on “సర్పంచ్​ తండ్రి ఆగడాలు.. టీఆర్ఎస్ ​నుంచి బహిష్కరణ”

  1. చిలుక ప్రవీణ్ అన్న చెప్పడం ద్వారా నేర్చుకున్నాను

Comments are closed.