Breaking News

ఉల్లాసంగా ఉత్సాహంగా క్రీడాపోటీలు

సామాజిక సారథి, పటాన్ చెరు: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని, మండల స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలో మరింతగా రాణించాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ తో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ… విద్యార్థి దిశనుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడల ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా రంగానికి పెద్ద పీట వేయడంతో పాటు, ప్రతిభ కలిగిన క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేలా శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. జిల్లాస్థాయి పోటీలో పాల్గొనే క్రీడాకారులకు సొంత నిధులతో ట్రాక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు ముగిస్తున్నందున, రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుండి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనుందని తెలిపారు. మూడు వారాలపాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, అమీన్ పూర్ ఎంపీపీ దేవానంద్, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గుమ్మడిదల జడ్పిటిసి కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అమీన్ పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.