Breaking News

తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

తెలంగాణ తరహాలో జమ్మూకాశ్మీర్ అభివృద్ధి

ఢిల్లీ/ఖమ్మం: తెలంగాణ మాదిరిగానే అన్నిరంగాల్లో జమ్ముకాశ్మీర్ లో కూడా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ లోకసభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు. జమ్ముకాశ్మీర్​ పునర్వ్యవస్థీకరణ చట్టసవరణ పై శనివారం లోక్ సభలో జరిగిన చర్చలో ఎంపీ నామా పాల్గొన్నారు. చట్టంలో తీసుకొచ్చిన రెండు సవరణలు అవసరమేనని అన్నారు. జమ్మూకాశ్మీర్ బిల్లు 2019లో లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా టీఆర్​ఎస్​ పూర్తిమద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు కూడా తాజాగా తీసుకొచ్చిన రెండు సవరణలకు మద్దతు తెలుపుతుందని స్పష్టంచేశారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..
ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. ‘15వ లోక్ సభ నడిచే సమయంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫరూఖ్ అబ్దుల్లా మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో లోక్ సభ నడుస్తూ ఉంటే జమ్మూకాశ్మీర్ లో అల్లర్లు చెలరేగి 300 మంది దాకా చనిపోయారు. అదే సమయంలో ఓ వైపు లోకసభ నడుస్తున్న క్రమంలో ఈ విషయం గురించి సభలో చర్చించాలన్నారు. అక్కడ గొడవ సద్దుమణగడానికి అక్కడికి నాయకులు వెళ్లాలని అన్నారు. ప్రభుత్వం నాయకులతో మాట్లాడి అక్కడకు వెళ్లేందుకు అంగీకరించారు. అప్పుడు నాయకురాలు సుష్మస్వరాజ్ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. నేను ఒక పార్టీకి పార్లమెంటరీ నేతగా ఉన్నా. మేమంతా చిదంబరంతో కలిసి మూడురోజుల పాటు జమ్మూకాశ్మీర్ వెళ్లాం. అక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఆ సమయంలో మేము అక్కడి హోటల్ నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మాతో పాటు ఆ సమయంలో ఓవైసీ, సీతారాం ఏచూరి కూడా ఉన్నారు. సెక్యూరిటీ ఇచ్చినా ఇవ్వకపోయినా తాము ముందుకుపోవాలని చిదంబరానికి స్పష్టం చేశాం. మేం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లేది లేదని స్పష్టంచేశాం. అయితే చిదంబరం మాత్రం సెక్యూరిటీ ఇవ్వలేమని, ఇక్కడే హెటల్ లోనే మాట్లాడాలని అన్నారని గుర్తుచేశారు. అయితే మేము మాత్రం అక్కడ ఆగకుండా సీతారాం ఏచూరి, ఓవైసీతో కలిసి స్థానిక నాయకుల వద్దకు వెళ్లి పరిస్థితి గురించి చర్చించాం. జమ్మూకాశ్మీర్ లో ఇండస్ట్రీ పాలసీ చదివిన తర్వాత అక్కడ ఫుడ్ ఇండస్ట్రీస్ పెట్టాలనే ఆసక్తితో ఉన్నారని నామా చెప్పారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, ప్రతిఒక్కరూ ఆ రాష్ట్రాభివృద్ధికి మద్దతు తెలపాలని కోరారు.
ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు భర్తీచేయాలి
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల మంజూరులో వ్యత్యాసం కనిపిస్తోందని, ఐఏఎస్​లకు సంబంధించి 208 పోస్టులకు గాను కేవలం 136 మంది ఉండగా, ఐపీఎస్​లకు సంబంధించి 140 మందికి గాను 105 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. ఈ పోస్టుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చక్కదిద్దాలని సభలోనే ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలని కోరారు.