
- పేదలకు 45 లక్షల గృహాలను నిర్మించాం
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఓ దళితుడి ఇంట్లో భోజనం చేశారు. అమృత్లాల్ భారతి కుటుంబం ఆయనకు ఆతిథ్యమిచ్చింది. ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగిన మంత్రులు సమాజ్వాదీ పార్టీలో చేరుతూ, ఓబీసీలు, దళితులను యోగి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. అమృత్లాల్ ఇంట్లో భోజనం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ విలేకర్లతో మాట్లాడుతూ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ను ఐదేళ్లపాటు పరిపాలించిందని, ఆ సమయంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద కేవలం 18,000 ఇళ్లను మాత్రమే నిర్మించిందని చెప్పారు. తన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీ కాలంలో ఈ పథకం క్రింద 45 లక్షల గృహాలను పేదలు, అణగారిన వర్గాలకు ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ డబుల్ ఇంజిన్ (కేంద్ర, రాష్ట్ర) ప్రభుత్వాల హయాంలో 2.61 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఉజ్వల యోజన క్రింద 1.36 కోట్ల కుటుంబాలు లబ్ది పొందాయని యోగి వివరించారు.