- 24గంటలో 55వేల పైచిలుకు కేసులు
- ఈ నెల 30 వరకూ విద్యాసంస్థలకు సెలవులు
- అన్ని యూనిర్సిటీ పరిధిలోని పరీక్షలు వాయిదా
సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,043 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 7,09,209కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వాటితో కలిపి రాష్ట్రంలో 4,057మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2013 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, కేసులు పెరుగుతుండటంతో అటు ప్రభుత్వం.. ఇటు ప్రజల్లోనూ టెన్షన్ నెలకొంది. తెలంగాణలోని అన్ని యూనివర్శిటీలు ఈ నెల 30 వరకూ సెలవులు పొడిగించాయి. కాగా, యూనివర్సిటీల్లో జరగాల్సిన అన్ని రకాల పరీక్షలు వాయిదా పడ్డాయి. మంగళవారం నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. ఇక ఆన్ లైన్ తరగతులపై ఉస్మానియా యూనివర్శిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం నుంచి ఈనెల30 వరకూ అన్ లైన్లో క్లాసులు నిర్వహించనున్నట్లు ఓయూ ప్రకటించింది.