Breaking News

ఇంటింటా తీరని విషాదగాథ

ఇంటింటా తీరని విషాదగాథ

  • ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో ఆపరేషన్​ వికటించి నలుగురి మృతి
  • అసలే పేద కుటుంబాలు.. అంతులేని దు:ఖం
  • మహిళల కుటుంబాలను పరామర్శించిన బీఎస్పీ నేతలు
  • రూ.50లక్షల ఎక్స్​గ్రేషియా, రెండెకరా భూమి ఇవ్వాలని డిమాండ్​

సామాజికసారథి, ఇబ్రహీంపట్నం: అసలే పేద కుటుంబాలు.. కూలీ పనికిపోతేనే కడుపునిండేది. అలాంటి మహిళలను మాయదారి ఆపరేషన్ పొట్టనపెట్టుకున్నది. చనిపోయిన నలుగురిలో ఏ కుటుంబాన్ని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. వారి పిల్లలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ వికటించి నలుగురు మహిళలు మృతిచెందారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ తరఫున మృతుల కుటుంబసభ్యులను పార్టీ స్టేట్ ​చీఫ్​ కోఆర్డినేటర్ మందా ప్రభాకర్, బడంగ్​ పేట డిప్యూటీ మేయర్​ ఇబ్రాం శేఖర్​​ నేతృత్వంలో బుధవారం పలువురు నాయకులు పరామర్శించారు. సీతారాంపేట, లింగంపల్లి గ్రామాల్లో లావణ్య, మైలారం సుష్మ కుటుంబసభ్యులను కలిసి ఓదార్చారు.ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావు తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్​ చేశారు. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, చనిపోయినవారి కుటుంబాలకు రూ.50లక్షలు, రెండు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, వారి భర్తలకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వమే చూసుకోవాలని డిమాండ్​ చేశారు. వారికి నెలకు రూ.20వేలు అందజేయాలని కోరారు. వారికి న్యాయం చేయకపోతే బీఎస్పీ తరఫున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

మృతుల కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న బీఎస్పీ నాయకులు
పరామర్శిస్తున్న మందా ప్రభాకర్​, ఇబ్రాం శేఖర్​ తదితరులు

పరామర్శించిన శ్రీనివాస్​ యాదవ్​
కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని మాడుగుల మండలం నర్సాయిపల్లి, రాజీవ్ నగర్ తండాకు చెందిన మమత, మౌనిక కుటుంబసభ్యులను బీఎస్పీ కల్వకుర్తి ఇన్​చార్జ్ కొమ్ము శ్రీనివాస్​ యాదవ్​ బుధవారం పరామర్శించారు. ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఎంతో ఆశపడి తెచ్చుకున్న తెలంగాణలో పేదప్రజల కోసం పనిచేయల్సిన ఈ ప్రభుత్వం పేదల ప్రాణాలు తీస్తున్నదని అన్నారు. ఈ ప్రభుత్వానికి కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కనీసం బాధితులను పరామర్శించకపోవడం సిగ్గుచేటన్నారు. ఆయన వెంట కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షుడు ఎట్టి, ఆమనగల్లు మండల ఇన్ చార్జ్​శ్రీశైలం, మాడ్గుల మండల కన్వీనర్ బద్ది రాజు, రవి, వెంకటేశ్​ తదితరులు పాల్గొన్నారు.

పరామర్శిస్తున్న బీఎస్పీ కల్వకుర్తి ఇన్​చార్జ్​ కొమ్ము శ్రీనివాస్​ యాదవ్​, ఎట్టి ఆంజనేయులు