Breaking News

ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావులు

ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావులు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: గిరి వికాసం పథకం కింద చిన్న, సన్నకారు ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావి తవ్వించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్టీ చిన్న, సన్నకారు రైతులు ఒకరికన్నా ఎక్కువమంది కలసి కనీసం 5 ఎకరాల భూమిని ఒకేచోట కలిగి ఒక యూనిట్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే గిరివికాసం పథకంకింద ఉచితంగా బోర్ వేసి మోటారుతో సహా అందించనున్నట్లు తెలిపారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి, ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదన్నారు. వారం పదిరోజుల్లో అర్హులైన ప్రతి లబ్దిదారుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని ఎంపీడీవో ఆదేశించారు.  గ్రామాలలో ఈ పథక పై అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు ఖర్చు కాలేదని, ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే అర్హులందరికీ లబ్ది చేకూర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.  స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్లో జిల్లాలో చేపట్టిన స్వచ్ఛ భారత్, ఓడీఎఫ్,  ఓడిఎఫ్ ప్లస్, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నియంత్రణపై అభిప్రాయం తెలిపేలా విధంగా జిల్లా నుండి అత్యధికంగా ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసేవిధంగా ప్రచారం కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు పాల్గొన్నారు.