Breaking News

వర్షాల వేళ అలర్ట్​గా ఉండండి

వర్షాల వేళ అలర్ట్​గా ఉండండి

సారథి, రామడుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్​జిల్లా రామడుగు ఎస్సై తాండ్ర వివేక్ గురువారం సూచించారు. వర్షానికి తడిసిన విద్యుత్ స్తంభాలు, గోడలను తాకవద్దని, ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. గృహిణులు జే వైర్లపై బట్టలను ఆరవేయకూడదని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న మట్టి ఇళ్లు, గోడల మధ్య ఉండకూడదని కోరారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులు, గాలిదుమారం సమయంలో ప్రజలు, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండకూడదని, సెల్​ఫోన్స్ వాడకూడదని సూచించారు. రైతులు వ్యవసాయ బావులు, బోర్ల వద్ద స్టార్టర్ బాక్స్ లు, ఫ్యూజ్ బాక్స్ లను చేతులతో ముట్టుకోకూడదని హెచ్చరించారు. వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా చిన్నారులు, ఈత రానివారు ఎట్టిపరిస్థితుల్లోనూ చెరువుల్లోకి దిగకూడదని, చేపలవేటకు వెళ్లకూడదని సూచించారు. నివాస గృహాల మధ్య చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని, అంటువ్యాధులు ప్రబలే అవకావం ఉందని అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నంబర్​100కు ఫోన్ చేయాలని ఎస్సై తాండ్ర వివేక్​కోరారు.