Breaking News

మూడు రోజుల పాటు వర్షాలు

మూడు రోజుల పాటు వర్షాలు

సారథి, హైదరాబాద్: మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్​వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వద్ద స్థిరంగా కొనసాగుతుందని సోమవారం వెలువరించిన రిపోర్టులో వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ద్రోణి మధ్య ట్రోపోస్పీయర్ స్థాయి వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపునకు వంపు తిరిగి ఉండి స్థిరంగా కొనసాగుతోందని, ద్రోణి కుచ్ నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భ, దక్షిణ ఛత్తీస్​గఢ్, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనం వ్యాపించి ఉందని వివరించింది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఎల్లుండి చాలా ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టంచేసింది. ఈ మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొన్నది.