Breaking News

పీఆర్సీలో 30 శాతం ఫిట్​మెంట్​

పీఆర్సీలో 30 శాతం ఫిట్​మెంట్​

  • ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీపికబురు
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి..
  • త్వరలోనే 50వేల ఉద్యోగ నియామకాలు
  • మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం
  • అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పీఆర్సీపై సీఎం కేసీఆర్​ సోమవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.పీఆర్సీలో 30శాతం ఫిట్​మెంట్​ ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 11వ పీఆర్సీ అమలు ఆలస్యమైందని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర మరువ లేనిదని కొనియాడారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. త్వరలోనే 50వేల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలులోకి వస్తుందని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేశారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగులు, టీచర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 80శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా అర్హులైన ఉద్యోగులతోపాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని 100శాతం అర్హులైన ఉద్యోగులందరు ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది.
పీ.ఆర్.సి. కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈ.హెచ్.ఎస్) నూతన విధివిధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15శాతం ఇచ్చే అదనపు పెన్షన్ (Additional Quantum of Pension) కు ఉన్న వయో పరిమితిని 75 ఏళ్ల నుండి 70 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా (Management wise) అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతోపాటు, ఆ సంఖ్య పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం.
కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విధి నిర్వహణలో మరణించిన సీ.పీ.ఎస్.(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతోపాటు, కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో రాష్ట్రంలో ప్రజాజీవనం స్తంభించడంతోపాటు, ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి.
కరోనా వల్ల రాబడి తగ్గి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పి.ఆర్.సి.కి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ తోపాటు, కలిపి పొందే విధంగా అవకాశం కల్పించబడుతుంది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయో పరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్ మెంట్ ప్రకటిస్తున్నామనే శుభవార్తను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి.
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకిత భావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది.