![సింగరేణి ఆస్పత్రుల్లో కోవిడ్కు మెరుగైన వైద్యం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/cmd-2f.jpg?fit=677%2C423&ssl=1)
సారథి న్యూస్, హైదారాబాద్: సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియా ఆస్పత్రుల్లో కోవిడ్ 19 వైద్యసేవల కోసం ఇప్పటివరకు రూ.8కోట్ల విలువైన మందులు, కిట్లు, సూట్లు పరికరాలను సిద్ధంగా ఉంచామని, మరో 21మంది డాక్టర్లను వైద్యసేవల కోసం తాత్కాలికంగా నియమించామని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం సింగరేణి ఆస్పత్రిల్లో కరోనాకు కేటాయించిన 643 బెడ్లకు అదనంగా మరో 600 బెడ్లను సిద్ధం చేసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. సింగరేణి పరిధిలో ఇప్పటివరకు 10,583 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 2,384 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని, వీరిలో 808 మంది వైద్యసేవల అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, మిగిలిన వారిలో 226 మంది కంపెనీ ఆస్పత్రుల్లో వైద్యం తీసుకుంటున్నారని వైద్యాధికారులు, డాక్టర్లు తెలిపారు. ప్రతిరోజు కరోనాపై సమీక్షిస్తూ తనకు నివేదించాలని డైరెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్, ఫైనాన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ బలరాం, చీఫ్ మెడిక ల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్ పాల్గొన్నారు