Breaking News

సారు మీకిది న్యాయమా..?

సారు మీకిది న్యాయమా..?

సారథి న్యూస్​ : కొందరు పోలీసులు ప్రజలపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకే వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై తాళం చెవితో దాడి చేశారు పెట్రోలింగ్ పోలీసులు. యువకుడి నుదుటిపై తాళం చెవితో పోడిచారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రాపుర్‌ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనపై మండిపడ్డ జిల్లా పోలీసు శాఖ ఓ ఎస్సై, ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేసినట్లు సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ దిలీప్‌సింగ్‌ కున్వర్‌ తెలిపారు. దీనిపై విచారణకు కూడా ఆదేశించామన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. రామ్‌పురా గ్రామానికి చెందిన దీపక్‌ తన మిత్రుడితో కలిసి బైక్‌పై పెట్రోల్‌ పోయించుకునేందుకు స్థానికంగా ఉన్న పెట్రోల్‌ బంక్‌కు వెళుతున్నాడు. ఆ సమయంలో అక్కడ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు వారి వాహనాన్ని ఆపారు. అయితే వారు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఓ పోలీసు వారి బైక్‌ తాళం చెవిని లాక్కొని దీపక్‌ నుదిటిపై బలంగా గుచ్చాడు. దీంతో నుదుటిపై తాళం చెవితోనే గ్రామానికి వెళ్లిన బాధితుడు జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్థులకు వివరించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఈ దారుణానికి పాల్పడ్డ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.