Breaking News

శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

శ్రీశైలం పవర్​హౌస్​లో మరోసారి మంటలు

సారథి న్యూస్, అచ్చంపేట: తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీశైలం పాతాళగంగ ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి మంటలు చెలరేగాయి. బతుకుజీవుడా అంటూ సిబ్బంది పరుగులు తీశారు. కరెంట్ ​కేబుల్ పైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది చెప్పారు. అయితే ప్రమాద తీవ్రతను అధికారులు పరిశీలిస్తున్నారు. లాన్​కు ఎలాంటి ప్రమాదం లేదని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనతో జెన్​కో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హతాశులయ్యారు. పొగలు కమ్ముకుంటుండడంతో ప్రాణంభయంలో పరుగులు తీశారు. కాగా, ఆగస్టు 20న భారీ అగ్నిప్రమాదం కారణంగా 9 మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి మరమ్మతు పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. కాగా, లగేజీతో వచ్చిన డీసీఎం విద్యుత్​ ఎంసీపీ బాక్స్​ను తాకడంతోనే విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్లు స్థానిక సిబ్బంది మీడియా ప్రతినిధులకు చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై అధికారులు, పోలీసులు స్పందిస్తూ.. మాక్​డ్రిల్​లో భాగంగా మంటలు వచ్చాయని చెప్పుకొచ్చారు.