Breaking News

శ్రావణం.. శుభకరం

శ్రావణం.. శుభకరం
  • నేటినుంచే శ్రావణమాసం ప్రారంభం
  • ఈ మాసంలోనే విశిష్ట పర్వదినాలు

సన్నటి చిరుజల్లులతో నాన్పుడు వానలు.. అడపాదడపా కుంభవృష్టి.. బోనాల సందడి.. మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు, పచ్చగా పసుపు పూసిన పాదాలతో సందడిగా తిరిగే ముత్తయిదువల కళకళ.. అంతటా ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి శోభ ఇనుమడించే తరుణమిది…ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రత్యేకతలపై ‘సారథి’ అందిస్తున్న స్పెషల్​ స్టోరీ..

శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి.. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగచతుర్థి, నాగపంచమి, పుత్రాదా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి.. ఇలా అనేక పండుగలు వస్తాయి. శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం.

ఈ మాసంలో రవి సంచరించు నక్షత్రాల ప్రభావం చంద్రుడి మూలంగా మన మీద ప్రభావం చూపిస్తుంది. చంద్రుడి చార నుంచి జరగబోయే దుష్ఫలితాలను నివారించేందుకు, మంచి కలిగించేందుకు, ధర్మాచరణాలను పండగగా ఆచరించడం నియమమైంది. మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మనస్సును తిప్పుకుని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకునేందుకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యమైంది. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివభక్తులు ఉపవాసాలు ఉంటారు. దీక్షతో ఉపవాసం ఉండి, శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతిదేవికి కుంకుమపూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఉత్తర భారతదేశంలో సోమవారాలను ఎక్కువగా పాటిస్తారు. ఉత్తరాదిలో శివాలయాల్లో ప్రత్యేకపూజలు, అభిషేకాలు చేస్తారు.

శ్రావణ మంగళవారం
శ్రీ కృష్ణుడు ద్రౌపదీదేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతం ఈ మాసంలో ఆచరించడం ఎంతో విశిష్టమైంది. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైధవ్యబాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు. కొత్తగా పెళ్లయినవారు తప్పకుండా ఐదేళ్లు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్లి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు. పెళ్లికి ముందు నాలుగేళ్లు చేయించి పెళ్లయిన తర్వాత మిగిలిన ఒక ఏడాది ఈ వ్రతాన్ని నోచుకుంటారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మిదేవిని షోడశోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఐదోవతనం, సంతానాభివృద్ది కలకాలం ఉంటాయని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి భక్త శులభురాలు. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం ఈ అష్టశక్తులను అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాం.

శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు, ఈ శక్తులన్నీ ఈయన ద్వారా ప్రసరించేవే. అతీత విషయాలను సామాన్య మానవులు గ్రహించలేరు. ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకు ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలు కలుగుతాయి. లక్ష్మీదేవిని అత్యంత ప్రీతికరమైన శుక్రవారం పూజిస్తే ఇవన్ని చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీపూజ శ్రేష్ఠమని శాస్త్రవచనం చెబుతోంది. శ్రీహరి జన్మనక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన, మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శ్రావణ శనివారాలు
ఈ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేల్పును పూజించడం సర్వశుభాలు చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయిన, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. ముఖ్యంగా శ్రావణ శనివారాల్లో ఉపవాసం ఉండి వేంకటేశ్వరస్వామి ఆరాధన, దేవాలయ ప్రదక్షిణలు, పిండితోచేసిన దీపాలతో దీపారాధన, గోసేవ చేస్తే తప్పకుండా కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు పేర్కొంటున్నారు.
శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని ఈ రోజున జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడిని ఈ రోజున పూజించండం ద్వారా, ఏకాగ్రత, బుద్దికుశలత, జ్ఞానం, ఉన్నత చదువులు కలుగుతాయని ప్రతీతి . జంధ్యాన్ని యజ్ఞోపవీతమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రిదేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వేదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. శ్రావణ పూర్ణిమ రోజున ఉపాకర్మ చేస్తారు. అంటే కొత్తగా ఉపనయనం అయినవారికి ప్రత్యేక హోమం, పూజలతో చేసే కార్యక్రమం.

రక్షాబంధనం
శ్రావణ పూర్ణిమ నాటి నుంచి ఏడాది పాటు ఎవరికీ అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక(రాఖి) దైవం ముందుంచి పూజించి, ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్ణసమయంలో కట్టడం చేయాలి. అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే 12 దాటాక, కాబట్టి అపరాహ్ణం అంటే 12 నుంచి 3 గంటల మధ్య. ఈ విధానాన్ని గర్ఘ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెబుతోంది. శ్రావణ మాసం అంటే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. కావునా ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఇది ఎప్పటి నుంచో వస్తున్న శాస్త్రవిజ్ఞాన సంప్రదాయమేనని తెలుస్తోంది.

:: దిండిగల్​ ఆనంద్​శర్మ
సీనియర్​ జర్నలిస్ట్​
సెల్​నం.96660 06418