Breaking News

శాంతి పరిష్కారానికి మొగ్గు

శాంతి పరిష్కారానికి మొగ్గు

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌ ఇష్యూను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయని ఫారెన్‌ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. బోర్డర్‌‌ ఇష్యూపై రెండు దేశాల మిలటరీ ప్రతినిధులు శనివారం చర్చలు జరిపిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ‘స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా బోర్డర్‌‌ ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు రెండు వర్గాలు అంగీకరించాయి. ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి రెండు దేశాల మధ్య శాంతి, ప్రశాంతత అవసరమని నాయకులు ఒప్పందానికి వచ్చారు’ అని విదేశాంగశాఖ స్టేట్‌మెంట్ రిలీజ్‌ చేసింది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70ఏళ్లు అయ్యాయని, విదేశాంగశాఖ చెప్పింది. ఇది కూడా సమస్యను క్లియర్‌‌ చేసేందుకు ఉపయోగపడిందని అభిప్రాయపడింది. బోర్డర్‌‌లో శాంతి, ప్రశాంతతను ఉంచేందుకు వీలుగా న్యూఢిల్లీ, బీజింగ్‌ మధ్య మిలటరీ, దౌత్య పరమైన సమావేశాలు జరుగుతూనే ఉంటాయని ప్రభుత్వం చెప్పింది.

లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ వద్ద కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై మన దేశం చైనాను చర్చలకు ఆహ్వానించడంతో బోర్డర్‌‌ పర్సనల్‌ మీటింగ్‌ పాయింట్‌ మాల్డోలో శనివారం భేటీ అయ్యారు. మన దేశం నుంచి లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌‌సింగ్‌, కమాండ్‌ ఆఫ్‌ 14 కార్ప్స్‌ ఈ మీటింగ్‌లో పాల్గొనగా.. చైనా నుంచి టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ కమాండర్‌‌ పాల్గొన్నారు. ఇండియా – చైనా బోర్డర్‌‌లో గత కొద్ది రోజులుగా టెంక్షన్‌ వాతావరణం నెలకొంది. లడఖ్‌ దగ్గర చైనా ఆర్మీని మోహరించడంతో టెన్షన్‌ ఏర్పడింది. ఈ నేపథ్యంలో చర్చల ద్వారా ఇష్యూను పరిష్కరించాలనుకున్న ఇరు వర్గాలు శనివారం సమావేశమయ్యారు.