Breaking News

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు

సారథి న్యూస్, అనంతపురం: వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే చాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి‌ ఆదేశాలు జారీచేశారు. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించ‌నుందని ప్రకటించారు. సోమ‌వారం సీఎం త‌న‌ క్యాంపు ఆఫీసులో ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్​ మల్లికార్జున్‌తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరాతీశారు. ఈ సందర్భంగా వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఈ ఏడాది జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. అందులో భాగంగా అప్పటివరకూ ఉన్న 1,059 వైద్య ప్రక్రియలకు, కొత్తగా మ‌రిన్ని చేరుస్తూ మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపుచేశారు. ఆ త‌ర్వాత‌ అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు. ఆ త‌ర్వాత అమలయ్యే వైద్యప్రక్రియల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్య ప్రక్రియలను కూడా అందిస్తున్నారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపచేసేవారు. అదికూడా నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లింపులు చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ అందని పరిస్థితి దాపురించేది. వీటిపైనా సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతోపాటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలకు ప్రత్యేకచర్యలు చేపట్టారు. 2019 జూన్‌ నుంచి రూ.1,815 కోట్లను, మరో రూ.315కోట్లను ఈహెచ్‌ఎస్‌ కింద ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం చెల్లించింది.