Breaking News

విలన్​గానే కొనసాగుతా..

టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరిగా ఉండేవారు సునీల్. కొద్దికాలం కిందట హీరోగా తన సత్తా చాటేందుకు మరో అడుగు ముందుకేసాడు సునీల్. హ్యస్యనటుడిగా పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాదరామన్న’ కూడా అంతే సక్సెస్​ను అందుకున్నాడు సునీల్. వెంటనే వరుసగా సినిమా ఛాన్స్​లు రావడంతో హీరోగా కంటిన్యూ అయ్యాడు. అయితే తర్వాత రోజుల్లో సునీల్ హీరోగా నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ప్లాఫ్​ వచ్చాయి. దీంతో మళ్లీ కామెడీగానే స్థిరపడాలని అనుకుని ‘అరవింద్ సమేత వీర రాఘవ’ చిత్రంతో ముందుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ల లిస్ట్ చాంతాడంత పెరిగింది.

ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి సత్య లాంటి కమెడియన్స్ హవా నడుస్తోంది. దాంతో సునీల్ విలన్ గా మారాడు. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటించిన ‘డిస్కోరాజా’ సినిమాలో సునీల్ విలన్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూడటంతో సునీల్ సాహసాన్ని జనాలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సునీల్ కెరీర్ కి ఇది కాస్త టర్నింగ్ పాయింట్ అనే చెప్పొవచ్చు. ఎందుకంటే సునీల్ హీరోగా చేస్తున్నప్పుడు వచ్చే రెమ్యూనరేషన్ ఇప్పుడు విలన్ వేస్తున్నప్పుడు కూడా వస్తున్నాయట.

ప్రస్తుత సినిమాలకు సునీల్ విలన్​గా వేషాలు వేయాలంటే రెండు విషయాలను డిమాండ్ చేస్తున్నాడట. ఒకటి తన పాత్రకు సుమారు రూ.కోటి ఇవ్వాలి.. లేదా రోజుకు రూ.మూడు లక్షల చొప్పున మినిమమ్ 30 రోజులు కాల్​షీట్స్ ఆయినా తీసుకోవాలి. ప్రస్తుతం సునీల్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్న అన్ని సినిమాలు ఇలాంటి డీల్ కుదర్చుకున్నవేనట. అయితే ‘డిస్కోరాజా’ ఫ్లాప్ అవ్వడంతో కాస్త రేట్ తగ్గించుకోమని అడుగుతున్నా సునీల్ మాత్రం తగ్గడం లేదట. ప్రస్తుతం సునీల్ ‘కలర్ ఫోటో’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. ఇటీవల కమెడియన్ గా పరిచయమైన సుహాస్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మరి ఈ కొత్త హీరోకి సీనియర్ నటుడు సునీల్ విలన్ గా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. విభిన్నమైన ఈ విలన్ రోల్ పై సునీల్ ఆశలు పెట్టుకున్నాడట. కాగా సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.