Breaking News

విప్లవం.. గంగూలీతోనే మొదలైంది

న్యూఢిల్లీ: ఇప్పుడున్న భారత్ జట్టు ఇలా తయారు కావడానికి బీజాలు నాటింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీయేనని ఇంగ్లండ్ మాజీ సారథి నాసర్ హుస్సేన్ అన్నాడు. దాదా హయాంలోనే భారత క్రికెట్లో విప్లవం మొదలైందన్నాడు. కాలక్రమంలో ఆ విప్లవమే.. భారత్​ను క్రికెటింగ్ పవర్ హౌస్​గా మార్చేసిందన్నాడు. ‘భారత జట్టులో భావోద్వేగాలను, ఉద్రేకాలను తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ. సారథిగా, ప్లేయర్గా, సహచరుడిగా క్రికెటర్లకు అండగా నిలిచాడు. తిరుగులేని భారత్ జట్టును రూపొందించడానికి ఆనాడే బీజాలు నాటాడు. అవి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఆ రోజుల్లో టీమిండియాతో మ్యాచ్ అంటే మేం చాలా భయపడేవాళ్లం. సౌరవ్ అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే భారత్ జట్టు రూపురేఖలు మార్చేశాడు’ అని హుస్సేన్ పేర్కొన్నాడు. ఇప్పుడున్న కెప్టెన్ విరాట్ కూడా దాదాతో సమంగా లక్షణాలను కలిగి ఉన్నాడన్నాడు. కోహ్లీలోని పోరాట యోధుడు.. టీమిండియాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని చెప్పాడు.