Breaking News

విద్యకు ఆన్ లైన్.. లైఫ్ లైన్

విద్యకు ఆన్ లైన్.. లైఫ్ లైన్

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కోవిడ్ సంక్షోభ సమయంలో ఆన్​లైన్ ​విద్య లైఫ్ లైన్ గా మారిందని గవర్నర్ డాక్టర్ ​తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. కరోనా విద్యాభ్యాసాన్ని ఆటంక పరిచినప్పటికీ, ఆన్ లైన్ పద్ధతులు, టెక్నాలజీతో చదువును కొనసాగించవచ్చని అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ ఆధ్వర్యంలో ‘ఆన్ లైన్ విద్యావకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై గవర్నర్ మంగళవారం ప్రారంభోపన్యాసం చేశారు. టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు అట్టడుగు వర్గాలకు చేరాలన్నారు. ఆన్ లైన్ విద్యతో విద్యార్థులు ఇంటికే పరిమితమై, స్కూలు, క్యాంపస్ లకు దూరంగా ఉన్న దృష్ట్యా వారి శారీరక, మానసిక, భావోద్వేగపరమైన ఆరోగ్యం పట్ల తల్లితండ్రులు, టీచర్లు ప్రత్యేకశ్రద్ధ చూపాలని గవర్నర్​ సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో చేపట్టిన భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా మొత్తం 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ ఇంటర్​నెట్​ సౌకర్యం కల్పన, డిజిటల్ ఇండియా మిషన్, డిజిటల్ క్లాస్ రూం పథకాల ద్వారా ఆన్ లైన్ విద్యావిధానం సులభతరమైందన్నారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు ఆన్ లైన్ విద్య అందాలన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో దేశంలోనే అందరికంటే ముందుగా ఏప్రిల్ లోనే ఆన్ లైన్ క్లాసుల ద్వారా డిగ్రీ, పీజీ విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఆన్ లైన్ తరగతులు ప్రారంభించిందని గవర్నర్ అభినందించారు. ఎన్ఐటీ వరంగల్ అనేక మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దుతోందని, తన సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కె.సురేంద్ర మోహన్ కూడా ఎన్ఐటీ పూర్వవిద్యార్థేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎన్ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్​ రమణారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్​ ఎస్.గోవర్ధన్ రావు, వెబినార్ కన్వీనర్లు ప్రొఫెసర్​ కోలా ఆనంద కిశోర్, డాక్టర్​ హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.