Breaking News

లేడీ సింగం

లేడీ సింగం

ఆమె ఓ సాధారణ లేడీ కానిస్టేబుల్​. కానీ ఏకంగా మంత్రి కొడుకుకే చుక్కలు చూపించింది. నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి సుపుత్రుడికి నడి రోడ్డుమీదే వార్నింగ్​ ఇచ్చింది. ‘నేను నీకు నీ బాబుకు సర్వేంట్​ను కాను’ అంటూ హెచ్చరించింది. ఇటీవల గుజరాత్​లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ మహిళా కానిస్టేబుల్​కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అయింది. ఇక ఆ కానిస్టేబుల్​ తెగువను మెచ్చుకోని వారంటూ లేరు. అయితే యధావిధిగా పోలీస్​శాఖ మాత్రం ఆమెమీద కక్ష గట్టింది. ఆమెకు ట్రాన్స్​ఫర్​ ఆర్డర్​ ఇచ్చింది. కానీ ఆమె మాత్రం బెదరలేదు. కొంచెం కూడా భయపడలేదు. కానిస్టేబుల్​ ఉద్యోగానికే రాజీనామా చేసింది. ఐపీఎస్​ అధికారిగా డిపార్ట్​మెంట్​లో అడుగుపెడతానంటూ శపథం చేసింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిన ఆ లేడీ కానిస్టేబుల్​ పేరు సునీతా యాదవ్​..

గుజరాత్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జులై 8 రాత్రి ఆమె సూరత్‌లో విధుల్లో ఉండగా.. ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చారు. దీంతో సునీత వారు కారు ఆపారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకులు ‘మేం ఎవరో తెలుసా’ అంటూ సునీతపైకి రాబోయారు. ఆగ్రహించిన సునీత యాదవ్​ నడిరోడ్డు మీదే వారిని చెడుగుడు ఆడేసింది. కాగా, ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు ఆరోగ్యశాఖమంత్రి కుమార్​ కానానీ కుమారుడు ప్రకాశ్​ కానానీ. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే రాజకీయ ఒత్తిళ్లతో సునీతను ట్రాన్స్​ఫర్​ చేశారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో ఓ రేంజ్​లో వైరల్​ అయింది. సునీతా సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె కోసం అప్పుడే ఫ్యాన్స్​క్లబ్​లు, ఫేస్​బుక్​ పేజీలు పుట్టుకొచ్చాయంటే అభిమానం ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు.