Breaking News

రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

రిపోర్టర్​ నుంచి ఎమ్మెల్యే దాకా..

సారథి న్యూస్, దుబ్బాక: మాధవనేని రఘునందన్​రావు టీఆర్ఎస్ తో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి బీజేపీలో రాష్ట్రస్థాయి కీలకనేతగా ఎదిగారు. రాజకీయాలకు రాక ముందు ఆయన ఓ ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేశారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై అవగాహన ఉన్న ఆయన డిగ్రీ వరకు సిద్దిపేటలో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్​బీ పట్టాపొందారు. విలేకరిగా మొదలైన మాధవనేని రఘునందన్​ రావు జీవితం ఎమ్మెల్యే స్థాయి దాకా వెళ్లింది. ఉమ్మడి మెదక్​జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో రఘునందన్​రావు జన్మించారు. తండ్రి పేరు భగవంతరావు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బార్​అసోసియేషన్‌లో న్యాయవాదిగా చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆయన టీఆర్ఎస్​పార్టీలో కీలకంగా పనిచేశారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, మెదక్ జిల్లా అధ్యక్షుడిగానూ పనిచేశారు. మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఆర్​ఎస్​లో జరిగిన అంతర్గత కుమ్ములాటల కారణంగా 2013లో గులాబీ పార్టీ నుంచి సస్పెన్షన్​కు గురైన రఘునందన్​రావు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2019 మెదక్ పార్లమెంట్​నుంచి పోటీచేసి ఓడిపోయారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో 1,470 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ రావు విజయం సాధించారు.