Breaking News

రామానుజం.. గర్వించదగ్గ సాహితీవేత్త​

రామానుజం.. గర్వించదగ్గ సాహితీవేత్త​

సారథి న్యూస్​, హైదరాబాద్​: తిరునగరి రామానుజం తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త​ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని ప్రశంసించారు. మహాకవి దాశరథి పురస్కారాన్ని సీఎం కేసీఆర్​ శనివారం ప్రగతిభవన్​లో రామానుజంకు అందజేశారు. శాలువా కప్పి సన్మానించారు. రామానుజం రాసిన ‘బాలవీర శతకం’, ‘అక్షరధార’, ‘తిరునగరీయం’ రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండడంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని అభినందించారు.
ఈ సందర్భంగా రామానుజం ఓ పద్యం రాసి, పాడి వివినిపించారు.
‘‘శ్రీ తెలంగాణమును
శ్రీ ఖండమును సేయ
అవతరించిన యెట్టి
అపర విష్ణుడవీవు
తెలగాణమున
కోటి ఎకరాలు పారించి
పంట భూమిగ మార్చ
ప్రతిన బూనిన యట్టి
రైతు స్వామివి నీవు
జాతి నేతవు నీవు
శ్రీ కల్వకుంట్ల
క్షీరాబ్ధి చంద్రమా
శ్రీ రస్తు
శ్రీ చంద్రశేఖరా
తెలంగాణ దీపమా
విజయోస్తు’’

కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.