Breaking News

రాజస్థాన్​ పంచాయితీ సుఖాంతం

రాజస్థాన్​ కథ సుఖాంతం

న్యూఢిల్లీ: రాజస్థాన్​లో నెలకొన్న రాజకీయ సంక్షోభం సుఖాంతం అయ్యింది. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్​ కీలక నేతలు రాహుల్​ గాంధీ, ప్రియాంకగాంధీని సచిన్​ పైలట్​, ఆయన వర్గం ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య సానుకూల చర్చలు జరిగాయని.. తిరిగి కాంగ్రెస్​ గూటికి రావడానికి సచిన్, ఆయనవర్గ ఎమ్మెల్యేలు​ ఒప్పుకున్నారని కాంగ్రెస్​పార్టీ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్​లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీని వేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. రెబల్​ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టం చేసింది.

కారణం ఇదేనా..

బీజేపీ సరైన హామీ ఇవ్వకపోవడం, తన వద్ద కూడా కేవలం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండడంతో పైలట్​ వెనక్కి తగ్గినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సచిన్​ డిమాండ్లకు రాహుల్​గాంధీ సానుకూలంగా స్పందించారట.​ ఆగస్టు 14నుంచి రాజస్థాన్​ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సచిన్​ పైలట్​ మెత్తబడడం కాంగ్రెస్​కు ఊరట నిచ్చే అంశమే.

సంక్షోభానికి ఇదీ కారణం..
రాజస్తాన్​లో డిప్యూటీ సీఎంగా ఉన్న సచిన్​ పైలట్​ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నిస్తున్నారని సీఎం అశోక్​ గెహ్లాట్​ ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సచిన్​ బేరసారాలు చేస్తున్నారన్న ఆరోపణలపై ప్రశ్నించేందుకు రాజస్థాన్ పోలీసులతో ఏర్పాటు చేసిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ తో సచిన్​ పైలట్​కు నోటీసులు ఇప్పించారు. దీంతో సచిన్​ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సీఎల్‌పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. తన వర్గం ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అజ్ఞాత ప్రాంతానికి వెళ్లారు. కాగా ఈ చర్యపై కాంగ్రెస్​ అధిష్ఠానం సీరియస్​ అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి పైలట్‌ను తొలగించింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరిపిందనేది కాంగ్రెస్ ప్రధాన ఆరోపణగా ఉండగా, ఆ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది.