Breaking News

మీరొస్తారా.. నన్ను రమ్మంటారా?

ట్విట్టర్ లో ఎంపీ విజయసాయిరెడ్డి

సారథి న్యూస్, అనంతపురం: ఏపీ ప్రతిపక్ష నేత ఎన్​.చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా బుధవారం విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. ‘చంద్రబాబు గారూ.. ఎల్జీ ప్లాంట్ కు అనుమతులపై చర్చకు వస్తారా..మీరు ఇంట్లోంచి బయటకు వస్తారా? నన్ను హైదరాబాద్ రమ్మంటారా, మీరు విజయవాడ వస్తారా?’ అంటూ ట్వీట్‌‌ చేశారు. మరో ట్వీట్‌లో.. ‘రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదు.

వీళ్లు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్ చేస్తే సీఎం గారు కోటి ఇస్తారు. వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారు. గొప్ప సలహా ఏదైనా ఇస్తే, పాటించకూడదని పట్టుదలకు పోయే స్వభావం కాదాయనది. కానీ వీళ్లకు ఆ స్థాయి ఏదీ?’ అంటూ మండిపడ్డారు. అంతకు ముందు ‘అనేకసార్లు కరెంటు చార్జీలు పెంచిన చంద్రబాబు ఇప్పుడు ధర్నాలు చేస్తామంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. విద్యుత్​ చార్జీల పెంపునకు నిరసనగా బషీర్ బాగ్ లో ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపించి ముగ్గురి ప్రాణాలు బలిగొన్న చరిత్ర నీది. 20 ఏళ్లయినా ఎవరూ మర్చిపోలేదు’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.