Breaking News

మాపై వివక్ష చూపారు: స్యామీ


న్యూఢిల్లీ: తనను ‘కాలూ’ అని పిలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు వర్ణ వివక్ష చూపెట్టారని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వెల్లడించాడు. మ్యాచ్ ల సందర్భంగా తనను, పెరీరాను ‘కాలూ’ అని సంబోధించేవారన్నాడు. దీనిపై సన్ రైజర్స్ ప్లేయర్లు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. 2014లో ఇషాంత్, స్యామీతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ పంచుకోగా, అందులో స్యామీ పేరును ‘కాలూ’గా సంభోదించాడు. దీంతో ఇది పెద్ద దుమారానికి దారి తీసింది. లక్ష్మణ్ పుట్టిన రోజు సందర్భంగానూ స్యామీ.. ‘ఈ డార్క్ కాలూ’ని మర్చిపోవద్దని అభినందనలు తెలపడం కూడా చర్చనీయాంశమైంది. అయితే స్యామీ వ్యాఖ్యలను సన్ రైజర్స్ ఆటగాళ్లతో పాటు బీసీసీఐ కూడా ఖండించింది.
ఆర్చర్​ను అలా..
ఇంగ్లండ్ కు వన్డే ప్రపంచకప్ నూ అందించిన జోఫ్రా ఆర్చర్ కూడా కెరీర్ ఆరంభంలో జాతి వివక్ష ఎదుర్కొన్నాడు. గతేడాది కివీస్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అభిమాని ఆర్చన్ ను వివక్షతో కూడిన వ్యాఖ్యలతో వేధించాడు. దీంతో విచారణకు దిగిన ఈసీబీ అభిమాని తప్పు చేశాడని తేల్చింది. ఫలితంగా సదరు అభిమానిని రెండేళ్ల పాటు మ్యాచ్ లకు రాకుండా నిషేధించారు.
సర్ఫరాజ్ ఇలా..
గతేడాది డర్బన్ లో జరిగిన వన్డేలో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్.. పెహుల్క్వాయోను ‘అబే కాలే’ అని పిలువడం వివాదాస్పదమైంది. సర్ఫరాజ్ మాటలు స్టంప్ మైక్రోఫోన్ లో రికార్డు కావడంతో అతనిపై నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించారు. తర్వాత అతను పెహుల్క్వాయోను క్షమాపణలు అడిగాడు.
టెర్రరిస్ట్​కు మరో వికెట్
2006.. శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా క్యాచ్ పట్టగానే ‘టెర్రరిస్ట్ కు మరో వికెట్ దక్కింది’ అని వ్యాఖ్యాతగా ఉన్న డీన్జోన్స్ అన్నాడు. ఈ విషయం అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపడంతో అతన్ని టెన్ స్పోర్ట్స్ వ్యాఖ్యాత బాధ్యతల నుంచి తప్పించింది. ఆస్ర్టేలియా మాజీ క్రికెటర్ లీమన్ కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంతో.. అతనిపై ఐదు మ్యాచ్ ల నిషేధాన్ని విధించారు.