Breaking News

మానవ మృగాలను ఉరితీయాలి

మానవ మృగాలను ఉరితీయాలి

సారథి న్యూస్, కల్వకుర్తి: ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ.. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ ​చేస్తూ.. శుక్రవారం సాయంత్రం నాగర్​కర్నూల్ ​జిల్లా కల్వకుర్తి పట్టణంలో యువజన, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆఫీసు నుంచి మహబూబ్​నగర్ ​చౌరస్తా మీదుగా హైదరాబాద్ ​చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్​లో దళిత మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా.. యోగి ఆదిత్యనాథ్​సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. పశువులకు ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు లేదన్నారు. పశుగ్రాసం కోసం వెళ్లిన దళిత యువతిని రేప్​చేసి.. నాలుక కోసి.. వెన్ను విరిచి దారుణంగా హత్యచేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు. పాస్ట్​ట్రాక్ ​కోర్టును ఏర్పాటుచేసి నిందితులను ఉరితీయాలని డిమాండ్​చేశారు. ‘చేతగాని సర్కారు దిగిపోవాలని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి’ అని డిమాండ్​ చేశారు. ఇప్పటికైనా బహుజన సమాజం మేల్కొవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం, చట్టాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వర్కాల ధనుంజయ్, మల్లేష్, శివ, కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షుడు పరశురాములు, బి.రామస్వామి తదితరులు పాల్గొన్నారు.