Breaking News

మహిళా సాధికారతను దెబ్బతీసిన కరోనా

మహిళా సాధికారతను దెబ్బతీసిన కరోనా
  • మహిళామణుల వ్యాపారాలు కుదేలు
  • ఎందరో మగువల ఆశయాలను చిదిమేసిన మహమ్మారి

హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం సమాజంతో మనిషి చేసే పోరాటం కంటే గుర్తింపు కోసం అదే మనుషులతో మగువ చేసే పోరాటం చాలా గొప్పది. దానికి మనోధైర్యం మాత్రమే చాలదు. సమాజం సమ్మతించాలి. కుటుంబం సహకరించాలి. అప్పుడు ఆ మగువ అడుగు ముందుకు వేయగలదు. తనను తాను ఓ శక్తిగా నిరూపించుకోగలదు. తీరా ఏ కారణం చేతైనా తాను వేసిన అడుగుల్లో తడబాటో, పొరబాటో, గ్రహపాటో తారసపడితే.. జీవితాంతం ఆ తప్పిదాన్ని ఎత్తిపొడిచేందుకు, నిలదీసేందుకు.. అప్పటిదాకా వెన్నంటే ఉన్న కుటుంబం కూడా సూటిపోటి మాటలతో విరుచుకుపడుతుంది. అన్నీ తెలిసి, అన్నింటికీ సిద్ధపడి, అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు కదులుతున్న ఆ మగువకు ఇప్పుడు విధే గ్రహపాటు అయింది. దాంతో ఆ అంతులేని ఆత్మవిశ్వాసం అవమానాల పాలైంది. అలుపులేని పోరాటం పట్టు తప్పిపోతోంది. అవును.. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్.. ఎందరో మహిళల ఆశయాలను చిదిమేసింది. ఆశపడి కూడబెట్టుకున్న ఆత్మగౌరవాన్ని కబళించింది. తనకంటూ ఓ స్థానం కోసం పోరాడుతున్న మగువల జీవితాల్లో నిరాశల్నే మిగిల్చింది. ‘మహిళా సాధికారత.. సవాళ్ల’పై ‘సారథి’ స్పెషల్​ స్టోరీ..

ఆడవాళ్లు వంటిల్లు దాటి బయటికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. అన్నింటికంటే ముందు అక్షరాలు నేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డ స్త్రీ.. సొంతంగా వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని అవమానాలు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మన దేశంలో కొన్నేళ్లుగా మహిళా వ్యాపారవేత్తల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే మధ్యతరగతి స్త్రీలు కూడా సొంతంగా చిన్నాచితకా వ్యాపారాలు చేస్తూ కుంటుంబానికి తోడుగా నిలుస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది..కానీ అనుకోకుండా వచ్చిన ఈ కరోనా ప్రపంచాన్నే తలకిందులు చేసింది. దీనివల్ల మహిళా వ్యాపారులు కేవలం ఆర్థికంగానే కాదు.. మానసికంగా ఎంతో దెబ్బతింటున్నారు. తాము దాటొచ్చిన అడ్డంకులను గుర్తుచేసుకుని బాధపడుతున్నారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, గతంలో కంటే మరింత ఆత్మస్థైర్యంగా ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ కరోనా కొందరి ఆడవాళ్ల జీవితాలను మళ్లీ వంటింటికి లాక్కెళ్లింది. తమ కాళ్లపై నిలబడుతున్నామన్న తమ నమ్మకాన్ని కొందరి నుంచి దూరం చేసింది.

బిజినెస్​ క్లోజ్ ​అయ్యేలా ఉంది
హైదరాబాద్​లో ఇంజినీరింగ్​ పూర్తవగానే బెంగళూరులో ఐటీ ఉడ్యోగం. మంచి శాలరీ.. లగ్జరీ లైఫ్​. కానీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది స్వాతి(పేరు మార్చాం). అందుకే సొంతంగా ఏదైనా బిజినెస్​స్టార్ట్​చేయాలని హైదరాబాద్​కు షిఫ్ట్​ అయింది. సిటీ మధ్య ఉండే ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లో​స్వాతి వాళ్లకు సొంత బిల్డింగ్​ఉంది. ఆ ఏరియా పక్కనే ఉండే అశోక్​నగర్​ సివిల్స్ ​కోచింగ్​ సెంటర్లకు ఫేమస్. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అమ్మాయిలు, అబ్బాయిలంతా ఇక్కడ సమీపంలోని హాస్టల్లో ఉంటారు. ఇదంతా అబ్జర్వ్​చేసిన స్వాతి ఒక లేడీస్​ హాస్టల్​స్టార్ట్​ చేసింది. సాదాసీదాగా కాకుండా స్టూడెంట్స్​కు స్పెషలిస్ట్​లతో మోటివేషనల్, యోగా క్లాసులు కూడా చెప్పిస్తస్తూ నంబర్​ వన్​హాస్టల్​గా పేరు తెచ్చుకుంది. ఈ కరోనా లాక్​డౌన్​కి ముందువరకు ఆమె బిజినెస్​ మంచి పీక్​లో ఉంది.
ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే.. తన బిజినెస్​ లైఫ్​క్లోజ్​ అయ్యేలా ఉందంటోంది. ‘మా హాస్టల్ ​స్టూడెంట్స్​అంతా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పైగా ఇప్పుడు వాళ్లకు ఆన్​లైన్​ క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి మళ్లీ వస్తారన్న నమ్మకం కూడా లేదు. మెయింటెనెన్స్​ఖర్చు తగ్గించుకోవడం కోసం ఒకరిద్దరు వస్తామన్నా వద్దనాల్సిన పరిస్థితి వచ్చింది. మా ఇంట్లో వాళ్లేమో ‘ఇప్పట్లో బిజినెస్​నడవదు లే.. గమ్మున పెళ్లి చేసుకో’ అంటున్నారు. అదే అబ్బాయి అయితే ఇలాగే చేస్తారా అన్నది నా ప్రశ్న. పెళ్లి చేసుకోవడానికి నాకేం ప్రాబ్లమ్​లేదు. కానీ బిజినెస్​లో నష్టం వస్తున్న కారణంతో పెళ్లి చేసుకుని, నా సెల్ఫ్​ రెస్పెక్ట్​ను తగ్గించుకోవడం నాకిష్టం లేదు. ఒక్క మా పేరెంట్స్​ మాత్రమే కాదు.. బంధువులు, చుట్టుపక్కన వాళ్లు కూడా ఇవే మాటలు అంటుంటే నిజంగా బాధేస్తోంది. కరోనా నాలాంటి అమ్మాయిల కలలను నాశనం చేసింది’ అంటూ బాధపడుతోంది స్వాతి.

సీక్రెట్​గా గోల్డ్​లోన్​ తీసుకున్నా..
శిరీష (పేరు మార్చాం) అమ్మానాన్నలు ఆంధ్రప్రదేశ్​లోని ఒంగోలులో ఉంటారు. హైదరాబాద్​లోని హాస్టల్​లో ఉంటూ డిగ్రీ చదివింది. తర్వాత ఎంబీఏ(హెచ్ఆర్​)పూర్తిచేసింది. ఒక స్టార్టప్​లో చేరి కంపెనీ డెవలప్​మెంట్​కు ఎంతగానో కృషిచేసింది. నాలుగేళ్లయ్యాక సొంతంగా ఒక హెచ్​ఆర్​కన్సల్టెన్సీ పెట్టాలనుకుంది. ఇంట్లో వాళ్లకు చెప్తే ‘సిటీలో ఒక్కదానివే ఉంటున్నావ్​. బిజినెస్​ చేయలేవమ్మా! ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోక వ్యాపారాలు ఎందుకు?’ అన్నారు. దాంతో అమ్మానాన్నలకు చెప్పకుండా వ్యాపారం మొదలుపెట్టింది.
‘జాబ్​చేసేటప్పుడే నాకు ఉన్న స్పెషల్​స్కిల్స్​ఏమిటో తెలుసుకున్నాను. దాంతో నేనే ఒక కంపెనీ పెట్టాలనుకున్నా. ఇంట్లోవాళ్లు వద్దనే సరికి పెట్టుబడి కోసం నా దగ్గరున్న గోల్డ్ ఆర్నమెంట్స్ ను తాకట్టు పెట్టాను. మెల్లగా బిజినెస్​కోసం ఒక్కొక్క కాంటాక్ట్​పెంచుకుంటూ వెళ్లాను. ఆ టైమ్​లో ఒక్కొక్కరు ఒక్కోవిధంగా కామెంట్​చేసేవాళ్లు. ప్రాజెక్ట్స్​కోసం వెళ్లినప్పుడు.. ‘ఒక అమ్మాయివి బిజినెస్​రన్​చేయగలవా?’, ‘బిజినెస్​అంటే చాలా టెన్షన్లు ఉంటాయి. వాటిని అమ్మాయిగా నువ్వు తట్టుకోలేవు. కావాలంటే నా వద్ద ఉద్యోగం ఇస్తాను’, ‘పెళ్లికాని అమ్మాయివి.. ఇలా మగాళ్ల మధ్య తిరగడం అవసరమా నీకు?’… లాంటి మాటలు చాలా ఎక్స్​పీరియెన్స్​చేశాను. మా వద్ద 35 మంది క్లయింట్స్​ఉండేవాళ్లు. కానీ ఈ కరోనా క్రైసిస్​లో ఒక్కరే మిగిలారు. దాంతో చాలా మెంటల్​స్ట్రెస్​కు లోనవుతున్నా. బిజినెస్​మళ్లీ నార్మల్​స్టేజీకి రావాలంటే ముందుకంటే ఎక్కువ కష్టపడాలి..’ అంటోంది శిరీష.

ఆడవాళ్ల మాటకు విలువ ఇవ్వరు
పేరుకు మంచి పొజిషన్​లో ఉన్నా, తన వద్ద పనిచేసే మేనేజర్లు, డెయిలీ​వర్కర్స్​కూడా ఆమె మాటలను పట్టించుకోరు అంటోంది. సివిల్​ఇంజినీర్​సౌజన్య(పేరు మార్చాం). ‘నేను వర్క్ చేసే​సైట్​కి మా నాన్నే కాంట్రాక్టర్. దానివల్ల నాన్నతో కలిసే సైట్కు వెళ్తుంటాను. ఈ ఫీల్డ్​లో నేను బాగా అబ్జర్వ్​చేసిన విషయం ఏమిటంటే చదువు, పొజిషన్​ఉన్నా సరే చాలామంది అమ్మాయి అనే కారణంగా తక్కువగా చూస్తారు. నాకు ఒక కుర్చీ చేసి కూర్చోమంటారే తప్ప, నాన్నకు రెస్పాండ్​అయినట్లు నా మాట వినరు. లాక్​డౌన్​లో నాన్న హెల్త్​బాగలేకపోవడంతో నేనొక్కదాన్నే సైట్​కు వెళ్తున్నాను. ప్రస్తుతం తక్కువ మందితో వర్క్​నడుస్తోంది. అందువల్ల వర్కర్స్​కు కొంతపని ఎక్కువ చెప్పాల్సి వస్తోంది. దాంతో చాలామంది నా మీద సీరియస్​ అవుతున్నారు. ఏం పనిచెప్పినా, ‘మీ నాన్నకు ఫోన్​చేస్తాం లే’ అంటున్నారు. ఇదే విషయం వాళ్లకు నాన్న చెప్పినా ‘సరే’ అంటున్నారు” అని బయట ఫీల్డ్​లో తాను ఎదుర్కొంటున్న వివక్ష గురించి చెప్పింది ప్రియాంక(పేరు మార్చాం).

మాపైనే సింపతీ ఎందుకు?
మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగం వదిలేసి బిజినెస్​ఫీల్డ్​లోకి రావాలనుకుంది. తెలంగాణ వీహబ్​లో రిజిస్టర్​చేసుకుని.. అమీర్​పేట్​మెట్రో స్టేషన్​లో ఒక ‘బ్యూటీ పార్లర్’ స్టార్ట్​చేసింది శిల్ప. టెక్నాలజీని వాడుతూ మెట్రో ప్యాసెంజర్ల అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని పార్లర్​ను రన్​చేస్తోంది. ‘ఎన్నోరకాల ఇబ్బందులు పడి నేను ఈ పార్లర్ ను స్టార్ట్​చేశాను. పార్లర్​లో పనిచేసే స్టాఫ్​కు మంచి శాలరీలు ఇస్తూ, తెచ్చుకున్న లోన్స్​కడుతూ హ్యాపీగా ఉండేదాన్ని. కానీ ఈ కరోనా వైరస్​వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం మార్చిలో మెట్రో రాకపోకలను నిలిపివేసింది. దాంతో నా బిజినెస్​కు బ్రేక్​ పడింది. లాక్​డౌన్​కు కొన్నిరోజుల ముందే హైటెక్​సిటీ మెట్రో స్టేషన్​లో మరో పార్లర్​తెరిచేందుకు ప్లాన్​ చేశాను. ఇప్పుడు స్టాఫ్​ను పూర్తిగా తీసివేయలేక, అప్పుచేసి మరీ నెలకింత శాలరీ ఇస్తున్నాను. ఎందుకంటే నా వద్ద పనిచేస్తున్న వాళ్లంతా లోయర్​ మిడిల్ ​క్లాసెస్​​ అమ్మాయిలు. వాళ్లు కూడా పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్​ప్రాబ్లమ్​కంటే ఎక్కువగా, అమ్మాయిని అన్న కారణంగా సింపతీ చూపించడం బాధగా ఉంది. ‘అబ్బాయిలంటే ఈ లాస్​ని ఎలాగోలా మేనేజ్​చేసుకోగలరు. నువ్వు ఎలా కోపప్​ చేయగలవు?’ లాంటి మాటలతో నన్ను చాలామంది సైకలాజికల్​గా డిప్రెస్​చేస్తున్నారు.’ అంటోంది శిల్ప.

కౌన్సెలింగ్ ​సెంటర్లకు క్యూ కడుతున్నారు
ప్రతి విషయంలోనూ వెనక్కిలాగే చేతులను దాటుకుని మరీ మహిళలు వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. అలాంటి వ్యాపారాలు ఇప్పుడు కరోనా కారణంగా కుదేలయ్యాయి. నష్టాల్లో కూరుకుపోయిన చాలామంది మహిళలకు అండగా నిల్చునేందుకు ఏ తోడూ ముందుకు రావడంలేదు. దాంతో మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఎంతోమంది కౌన్సెలింగ్​ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. తన వద్దకు వస్తున్న ఎన్నో కేసుల్లోంచి రెండు కేస్​స్టడీస్ ​గురించి వివరించారు హైదరాబాద్​కి చెందిన లైఫ్​కోచ్​ అండ్​థెరపిస్ట్​సహానా రబీంద్రనాథ్​.
– భార్గవి ఐదేళ్లుగా హైదరాబాద్​లో బొటీక్​నడిపిస్తోంది. అయితే ఈ లాక్​డౌన్​కారణంగా బిజినెస్​లో లాస్​ వచ్చింది. ఆదాయం పక్కనబెడితే బట్టల స్టాక్​అంతా మూలనపడింది. ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే ఆమె భర్త వినోద్​ఉద్యోగం ఈ లాక్​డౌన్​లో పోయింది. దాంతో దంపతుల మధ్యలో విభేదాలు మొదలయ్యాయి. ‘నీ బొటీక్ వల్లే సేవింగ్స్​లేకుండా అయ్యాయి. లాభాలు తీసుకురాకుండా, సరిగ్గా మేనేజ్​చేయలేని నువ్వు అసలు బిజినెస్​ ఎందుకు స్టార్ట్​చేశావ్​?’ అంటూ ఆ భర్త భార్గవిని తరచూ వేధించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనం బట్టలు కొనడం, కుట్టించుకునే అవకాశం లేదు. దాంతో ఆ మెటీరియల్​ను ఏంచేయాలో తెలియక భార్గవి సతమతమవుతోంది. చేతిలో ఉద్యోగం, వ్యాపారం లేకపోవడంతో వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి.
– ఈ ఏడాది జనవరిలోనే రాజేశ్వరి చిన్న ఫుడ్ ​డెలివరీ బిజినెస్​ స్టార్ట్​ చేసింది. ఆమె బిజినెస్​కు మొదటి కస్టమర్స్​ కాలనీవాళ్లే. తర్వాత జొమాటో, స్విగ్గీలో రిజిస్టర్​ చేసుకుంది. లాక్​డౌన్​కు కొన్ని రోజుల ముందే ఆమె బిజినెస్ ​లాభాల్లోకి వచ్చింది. అంతలోనే కరోనా వ్యాపించడం, ప్రభుత్వం లాక్​డౌన్​ ప్రకటించడంతో రాజేశ్వరి వ్యాపారం దెబ్బతిన్నది. అసలు ఆ బిజినెస్​ స్టార్ట్​ చేయడానికి భర్తను ఎంతో కష్టపడి ఒప్పించింది. ఆయన సంపాదనతో ఇల్లు గడిచినా, ఆమె సంపాదించే డబ్బు ఇంజినీరింగ్​చదువుతున్న కూతురు పెళ్లి ఖర్చులకు దాచాలనుకుంది. ఇప్పుడు భర్త ఆదాయం కూడా తగ్గింది. దాంతో ఇంట్లో ఖర్చులను వెళ్లదీయలేక రాజేశ్వరిని ఆమె భర్త వేధించడం మొదలుపెట్టాడు. ‘ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను బిజినెస్​స్టార్ట్ ​చేయడమే పెద్ద తప్పుగా నా భర్త భావిస్తున్నాడు. కరోనా ఉన్నాపోయినా, లాక్​డౌన్​ ఎత్తేసినా.. నేను మళ్లీ బిజినెస్ ​స్టార్ట్ ​చేస్తానన్న నమ్మకం లేదు. మా ఆయన అందుకు చచ్చినా ఒప్పుకోడని అర్థమైంది.’ అని బాధపడుతూ చెప్పింది రాజేశ్వరి.

కరోనా తెచ్చిన సమస్యలు.. మారిన రాతలు
–ఇంట్లో అందరికంటే ఎక్కువ బాధ్యతలను మహిళలే మోస్తుంటారు. మరీ ముఖ్యంగా పెళ్లయిన స్త్రీలను ఉద్యోగాలకు పంపడానికే చాలామంది వెనకాడుతారు. అలాంటిది పిల్లలు ఉంటే వాళ్లను వ్యాపారం కోసం బయటికి పంపాలంలే భర్తలు కచ్చితంగా ఆలోచిస్తారు. ఇటు అమ్మనాన్నలు, అటు అత్తమామలు కూడా వ్యాపారం చేస్తామనే మహిళలను ప్రోత్సహించరు. దాంతో కుటుంబాన్ని సైతం వదిలేసి వ్యాపారవేత్తలుగా మారిన స్త్రీలు ఇప్పుడు కరోనా క్రైసిస్​ కారణంగా ఫ్యామిలీ కోసం కాంప్రమైజ్​అవుతున్నారు.
–ఈరోజుల్లో చాలామంది అమ్మాయిలు ఉద్యోగాల కంటే సొంతంగా వ్యాపారం చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు చాలామంది తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. కానీ అలాంటి అమ్మాయిలే పెళ్లి చేసుకోగానే వ్యాపారం పక్కనబెట్టి హౌస్​​వైఫ్​గా సెటిలవుతున్నారు. కారణం ఆర్థికంగా సెటిలైన భర్తలు తమ భార్య ఇంటిని, పిల్లలను చూసుకుంటే చాలనుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో నుంచి వచ్చిన మహిళా వ్యాపారవేత్తలు లాక్​డౌన్​లో డొమెస్టిక్​వయొలెస్​కు గురవుతున్నారు.
–ఉమెన్​స్టార్టప్​లకు ఫండ్​రైజింగ్​లో పురుషులకంటే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కారణం ఒక మహిళా వ్యాపారవేత్త ఆర్థిక లావాదేవీలను చూసుకోలేదన్న అపనమ్మకం. అలాగే ఒక మహిళ మొదలుపెట్టే వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకురావు. అమ్మానాన్నల నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాపార రంగంలోకి అడుగుపెడతారు కాబట్టి ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఫైనాన్స్​అందదు. కొన్ని ఫైనాన్షియల్​కంపెనీలు కూడా ఆడవాళ్లన్న ఒకేఒక్క కారణంగా లోన్లు ఇవ్వడానికి ముందుకురారు. పైగా కరోనా, లాక్​డౌన్​వల్ల వచ్చిన నష్టాల నుంచి ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదని చాలామంది మహిళా వ్యపారవేత్తలుల వాపోతున్నారు.
మహిళల పట్ల వివక్ష వ్యాపార రంగంలోనూ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐదారుగురు కలిసి వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నప్పుడు, అందులో మహిళను చేర్చుకోవడానికి పురుషులు ఆసక్తి చూపించరు. ఒకవేళ చేర్చుకున్నా వ్యాపారంలో నష్టం వస్తే, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత మహిళలదేనంటున్నారు మేల్​ బిజినెస్​ పార్ట్​నర్స్​. ఇప్పుడు లాక్​డౌన్​లో ఇలాంటి సమస్యలను ఎంతోమంది ఎదుర్కొంటున్నారు.​
–ఏ బిజినెస్ ​స్టార్ట్​ చేయాలన్నా.. దానికి ఎంతో గ్రౌండ్​వర్క్​ చేయాల్సి ఉంటుంది. పైగా రోజుకు పదిమందిని ఏదో ఒక విషయంపై కలవడానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మహిళలకు ఎదురయ్యే వేధింపుల్లో కమిట్​మెంట్స్​ కూడా ఉంటాయి. ఇన్ని కష్టాలు పడి బిజినెస్ ను ఒకస్థాయికి తీసుకొస్తే, కరోనా ఒక్కసారిగా అలాంటి మహిళా వ్యాపారులను మళ్లీ మొదటికి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ తమ వ్యాపారాలను అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి ఇంకెన్ని సమస్యలను ఎదుర్కోవాలోనని బాధపడుతున్నారు.
– ఒక అమ్మాయి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం మొదలుపెట్టి లక్షలు సంపాదిస్తున్నా.. ఎదుటివాళ్లు ఆమెను లోకువగా చూడడం సమాజంలో చాలాచోట్ల కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మరొక పెద్ద సమస్య ఏమిటంటే.. ఆడవాళ్ల కింద పని చేసేందుకు చాలామంది పురుషులు ముందుకురావు. ఒకవేళ పని చేస్తున్నా, మేల్​సూపర్​వైజర్​కు ఇచ్చే గౌరవం కూడా లేడీ మేనేజింగ్​డైరెక్టర్​కు ఇవ్వరని చాలా ఇంటర్వ్యూస్​లో ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్​ చెప్పుకొచ్చారు.


:: ఎన్ఎన్