Breaking News

మంచిర్యాల టు అమెరికా

సహర్ష

సింగరేణి బిడ్డ సుహర్ష ఘనత
అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో సీటు

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఓ వైపు కోవిద్ ప్రభావం, మరోవైపు విద్యావ్యవస్థలో గందరగోళం ఉన్నప్పటికీ తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్స్ తమ సత్తా చాటుతున్నారు. మొన్న సూర్య దీపిక.. నేడు సుహర్ష ప్రతిష్టాత్మక అమెరికా యూనివర్సిటీ ఆఫ్ అబర్న్ లో ఎంఎస్సీ సీటు సాధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో ఫైనలియర్ చదువుతున్న వీరిద్దరికీ ఈ గొప్ప అవకాశం వచ్చింది. గతంలో సూర్య దీపిక, ఎమ్మెస్సీ ఫారెస్ట్ జెనటిక్స్ లో సీటు సాధించింది. తాజాగా, సుహర్ష ఎమ్మెస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రెండేళ్ల కోర్సును ఎంపికైంది.
రెండేళ్ల ఆఫర్​
ట్యూషన్ ఫీజు రెండేళ్లకు కలిపి 30వేల డాలర్లకు యూనివర్సిటీ మినహాయింపు ఇచ్చింది. దీనితో పాటు 1500 డాలర్ల స్కాలర్ షిప్ ను కూడా రెండేళ్ల పాటు ఆఫర్ చేసింది. ఈ మొత్తం సుమారు రూ.50లక్షలు కానుంది. అబర్న్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్‌ ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ డీన్ గా ఉన్న జానకిరాంరెడ్డి అవలపాటి సహకారంతో వీరిద్దరూ సీటు సాధించారు.
ఫైనలియర్ లో మొత్తం 49 మంది స్టూడెంట్స్ ఉంటే, అందులో 31 మంది అమ్మాయిలే. మరో ఆరుగురు విద్యార్థినులు ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సీటీ డెహ్రాడూన్ లో వుడ్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ చదివేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని తొలిసారిగా ఎంట్రెన్స్​టెస్ట్ కేంద్రాన్ని కూడా హైదరాబాద్లో నిర్వహించేందుకు నిర్ణయించారు.
అంతర్జాతీయ స్థాయి వసతులు
ఫైనలియర్ లో ఉన్న మరో 20 మంది సివిల్ సర్వీసు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. స్వయంగా కాలేజీ డీన్ చంద్రశేఖర్​రెడ్డి వారిని ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ముఖ్యంగా ఫారెస్ట్ కాలేజీ నుంచి జాతీయస్థాయి ప్రతిభతో అధికారులుగా ఎంపిక కావాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కాలేజీని ఏర్పాటుచేశారు. అంతర్జాతీయ స్థాయి వసతులు ములుగు క్యాంపస్ లో కల్పించారని డీన్ తెలిపారు.
ఆనందంగా ఉంది..
సుహర్ష మంచిర్యాలకు చెందిన వారు. ఆమె తండ్రి సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని, కాలేజీలో అనువైన వాతావరణం, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.