Breaking News

బాలింతల ఆరోగ్యానికి భరోసా

బాలింతల ఆరోగ్యానికి భరోసా

  • ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకానికి శ్రీకారం
  • ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’కి విశేష స్పందన

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రంలోని బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాన్న సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ పథకాన్ని సెప్టెంబర్‌ 1న ప్రారంభించనున్నారు. గతంలో గిరిజనులకు మాత్రమే వర్తించే ఈ పథకం ఇక నుంచి అందరికీ వర్తించనుంది. పథకంలో భాగంగా రాగిపిండి కేజీ, బెల్లం 250 గ్రాములు, చిక్కి 250 గ్రాములు, ఎండు ఖర్జూరం 250 గ్రాములు, సజ్జ లేదా జొన్నలు 250 గ్రాములు, అటుకులు కేజీ చొప్పున ఇవ్వనున్నారు. ఈ స్కీం ద్వారా ఆరునెలల నుంచి 36 నెలల్లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తారు. బాలామృతం 2.5 కేజీలు, ప్రతినెలా గుడ్లు 25, ఐదులీటర్ల పాలు పంపిణీ చేస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 13.5 లక్షల మంది చిన్నారులు లబ్ధిపొందనున్నారు.
‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ విశేష ఆదరణ
ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ ​2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ స్కూళ్లలో నిర్వహిస్తున్న ‘అంగన్‌వాడీ పిలుస్తోంది’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ వరకు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రంలోనే ఇంగ్లిష్​లో పాఠాలు చెబుతారు. ప్రతి అంగన్ వాడీ కేంద్రంలో ఆటవస్తువులు, వసతులు, పౌష్టికాహారం.. తదితర వసతులను సమకూర్చుతారు. ఈ విషయాలను తల్లిదండ్రులకు ఇంటింటికి వెళ్లి అంగన్​వాడీ టీచర్లు, కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకానికి మంచి స్పందన లభించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్​వాడీ కేంద్రాలకు పంపించేందుకు ఆసక్తి చూపుతున్నారని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్​ శారద భాగ్యరేఖ వివరించారు. ఇక్కడ చదివిన పిల్లలను నేరుగా ప్రభుత్వ స్కూలుకు 1వ తరగతికి రెఫర్ ​చేస్తామని ఆమె చెప్పారు.