![ప్రణబ్ ముఖర్జీ మృతికి బైరెడ్డి నివాళి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/byreddy-2f.jpg?fit=283%2C375&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ ప్రాంత ఉనికిని కాపాడారని, ఆయన అకాలమరణానికి చింతిస్తూ కన్నీటితో నివాళులు అర్పిస్తున్నామని బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి విచారణ వ్యక్తంచేశారు. ‘రాయల తెలంగాణ వద్దు.. రాయలసీమ ముద్దు’ అన్న నినాదంతో హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద తాము 52 గంటల పాటు నిరాహార దీక్ష చేశామని గుర్తుచేశారు. రాయలసీమ అస్తిత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొందరు సీమ ద్రోహులు కుట్ర పన్నారన్నారు. రాయలసీమ అంటే ఆది శేషువుతో సమానమని, తల తిరుపతి అయితే, తోక శ్రీశైలం అని, రెండింటినీ విడగొట్టకండి.. అని విన్నవించామని గుర్తుచేశారు. అందుకు స్పందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాయలసీమ విచ్ఛిన్నం కాకుండా కాపాడారని వివరించారు. ఆయనకు రాయలసీమ ప్రజలంతా రుణపడి ఉంటారని పునరుద్ఘాటించారు.