![పోలీసు ఆఫీసర్లు ఎక్కడికి వెళ్లొద్దు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/dgp.jpg?fit=677%2C437&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో పోలీస్ శాఖను డీజీపీ అప్రమత్తం చేశారు. పోలీస్ అధికారులంతా 24 గంటల పాటు విధుల్లో ఉండి ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా చూడాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, విపత్తుల నివారణ శాఖ, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా డయల్ 100 కు వచ్చే కాల్స్ అన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని స్పష్టంచేశారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా డయల్ 100కు ఫోన్ చేయాలని రాష్ట్ర ప్రజలను డీజీపీ ఎం.మహేందర్రెడ్డి కోరారు.