సారథిన్యూస్, హైదరాబాద్: కరోనా సృష్టించిన సంక్షోభం ఇప్పుడు పసిపిల్లలపైనా పడింది. ఆన్లైన్ క్లాసుల పేరుతో చిన్నపిల్లలు తరుచూ ల్యాప్టాప్, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ముందు గంటల తరబడి ఉండాల్సి వస్తున్నది. దీంతో పిల్లల కళ్లపై తీవ్ర భారం పడతుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎనిమిది గంటలపాటు..
ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైన తర్వాత విద్యార్థులు డిజిటల్ పరికరాలను వినియోగించడం పరిపాటిగా మారింది. మొదట్లో రెండు లేదా మూడు గంటలే డిజిటల్ పరికరాలతో గడిపేవారు. కానీ ఇప్పడు దాదాపు ఎనిమిది గంటల పాటూ విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులు బోధిస్తున్నారు. గంటల తరబడి ఆన్లైన్ క్లాసులు వింటే కంటి సమస్యలు ప్రారంభమవుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్లను తథేకంగా చూడటం వల్ల వచ్చే సమస్యలను సైన్స్ పరిభాషలో ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ లేదా డిజిటల్ ఐ స్ట్రెయిన్’ అని పిలుస్తారని కొండాపూర్ అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఆప్తమాలజిస్టు అల్పా అతుల్ ఫూరబియా తెలిపారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే పిల్లల్లో శారీరక, మానసిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ స్క్రీన్తో తలెత్తే సమస్యలు
కండ్లు పొడిబారడం, మంటలు, నొప్పి రావడం, ఎర్రబడటం, కండ్ల నుంచి నీళ్లు కారడం, అలసిపోయి కండ్లు మూతపడిపోవడం, కండ్ల కింద నల్లటిచారలు రావటం, చూపు మందగించడం, తలనొప్పి, మెడ వెనుకభాగంలో తీవ్రమైన నొప్పి, భుజాల నొప్పులు.
జాగ్రత్తలు మేలు
పదే పదే కనురెప్పలు ఆడించాలి. స్క్రీన్ను తదేకంగా చూడకుండా ఒకటి రెండు క్షణాలపాటు పక్కకు తిరిగి చూడాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. ఆ సమయంలో దూరంగా ఉన్న వస్తువులను చూడాలి. కాసేపు కండ్లకు విశ్రాంతి ఇవ్వాలి. కళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి స్క్రీన్ లైటింగ్, గదిలో కాంతి సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. సరైన కుర్చీని ఎంపిక చేసుకొని, నిటారుగా కూర్చోవాలి. స్క్రీన్పై అక్షరాల సైజ్ను పెంచుకోవడం, గ్లేర్ను తగ్గించే స్క్రీన్ గార్డులు, కవర్లు వాడటం. విటమిన్ ఏ, విటమిన్ సీతో కూడిన ఆహార పదార్థాలు, బొప్పాయి, క్యారెట్, బ్రాకోలి, తోటకూర, గుడ్లు వంటివి తీసుకోవాలి.